Samuel Controversy: బ్రాహ్మణ సమాజాన్ని తాను కించపరిచినట్లు వస్తున్న వార్తలను ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్రంగా ఖండించారు. తాను మాట్లాడిన మాటలు కేవలం వ్యక్తిగతమని, వాటికి కాంగ్రెస్ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రసంగంలో భాగంగా అలవాటుగా కొన్ని మాటలు దొర్లాయే తప్ప.. ఎవరినీ ఉద్దేశపూర్వకముగా బాధపెట్టాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. కాబట్టి బ్రాహ్మణులు ఈ విషయంలో ఆందోళన చెందడం సరికాదని ఆయన విజ్ఞప్తి చేశారు.
అదే సమయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై సామెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తుంగతుర్తికి వచ్చి తనను ఓడగొడతానన్న బండి సంజయ్ సవాల్కు కౌంటర్ ఇస్తూ.. ‘తుంగతుర్తికి వస్తే ఇక్కడి ప్రజలు తుంగలో పడేసి తొక్కుతారు’ అని హెచ్చరించారు. దమ్ముంటే తాను కరీంనగర్ వస్తానని, అక్కడ మాదిగలతో భారీ కవాతు నిర్వహిస్తానని సవాల్ విసిరారు. బిజెపి ప్రభుత్వంలో ఒక్క ఎస్సీ మంత్రి కూడా లేరని విమర్శిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఐదుగురు దళిత మంత్రులు ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
బ్రాహ్మణులపై నిజంగా ప్రేమ ఉంటే, ఆర్థికంగా వెనుకబడి తిండిలేక అల్లాడుతున్న బీద బ్రాహ్మణులను ఆదుకోవాలని బండి సంజయ్కు సూచించారు. రాజ్యసభలో దళితులను అవమానించిన ఉదంతాలను ప్రస్తావిస్తూ, తనపై క్రిమినల్ కేసులు పెట్టడం కంటే.. దళితులను కించపరిచిన బండి సంజయ్పైనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మందుల సామెల్ డిమాండ్ చేశారు.
Also Read: ఘోర ప్రమాదం.. ఆటోను ఈడ్చుకెళ్లిన లారీ.. స్పాట్లోనే నలుగురు!