Debris Dump: స్వేచ్చ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లోని ఐటీ హాబ్ అంటేనే ఆదో పాశ్చాత్య దేశ వాతావరణాన్ని తలపిస్తుంది. పరిసరాలను గమనిస్తుంటే అసలు మనం మన హైదరాబాద్ నగరంలోనే ఉన్నామా? లేక విదేశాల్లో ఉన్నామా? అన్న భావన తప్పకుండా కల్గుతుంది. కారిడార్ మొత్తంలో ఎటు చూసినా ఆకర్షణీయంగా కన్పించే బహుళ అంతస్తు భవనాలు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన పలు అంతర్జాతీయ కంపెనీల క్యాంపస్ లు, కట్టుదిట్టమైన సైబర్ సెక్యూరిటీ తో కొనసాగే ఆఫీసులు దర్శనమిస్తుంటాయి. కానీ వివిధ శాఖల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ ఐటీ కారిడార్ లో పెద్ద పెద్ద టవర్లతో పాటు పెద్ద చెత్త, డెబ్రీస్ గుట్ట కూడా దర్శనమిస్తుంది. ఏకంగా అయిదారు అంతస్తుల వరకు పేరుకుపోయిన చెత్త కుప్పలు, నిర్మాణ వ్యర్థాలతో గుట్టలు దర్శనమిస్తున్నాయి.
హైటెక్ సిటీ సమీపంలో ఐకియా నుంచి మీనాక్షి టవర్ వైపు వెళ్లే దారిలో ఈ భారీ డె్బ్రీస్ గుట్ట దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో సర్వ హంగులతో నిర్మితమైన అందమైన అతి పెద్ద భవనాల మధ్య ఈ డెబ్రీస్ గుట్ట దర్శనమివ్వటం, ఇక్కడకు తరుచూ సందర్శనకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ ఐటీ నిపుణులు, ఐటీ కంపెనీల యజమానులకు ఒకింత విస్మయాన్ని కల్గిస్తుందనే చెప్పవచ్చు. గడిచిన దశాబ్దం కాలంగా ఈ ప్రాంతలో జరుగుతున్న వేగంగా జరుగుతున్న నిర్మాణ కార్యకలాపాల్లో భాగంగా ఈ డెబ్రీసే పేరుకుపోయినట్లు సమాచారం.
పైగా చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిర్మాణ వ్యర్థాలను కూడా ఇక్కడ వేయటంతో సుమారు 13 ఎకరాల్లో చెత్తా, చెదారం, నిర్మాణ వ్యర్థాలు గుట్టలా మారాయి. సుమారు 15 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు ఈ మౌంటైన్స్ వల్ల ఎయిర్ పొల్యూషన్ కూడా పెరిగిపోతుండటంతో వెంటనే ఇక్కడి నుంచి చెత్త కుప్పలు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఐకియా జంక్షన్ నుంచి మీనాక్షి టవర్స్ వైపు ప్రయాణిస్తున్నపుడు పెద్ద పెద్ద టవర్లు, అందమైన ఆకృతుల్లో నిర్మించిన బడా భవనాలు కంటికి ఎంతో ఆకర్షణీయంగా హైదరాబాద్ వాసులకు ఎంతో గర్వకారణంగా ఫీల్ వచ్చేది. ఈ భారీ డెబ్రీస్ గుట్ట కన్పించే సరికి ఒకింత అసంతృప్తి కల్గుతుంది.
Also Read: Hansika Motwari : బ్లాక్ డ్రెస్ లో బ్యాక్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న యాపిల్ బ్యూటీ..
ఇదే రూట్ లో మరో వైపు చూడగా ఈ చెత్త, నిర్మాణ వ్యర్థాల గుట్ట దర్శనమిస్వటంతో ఏదో తెలియని అసహనం కూడా కలగకమానదని పలువురు స్థానికులు వాపోయారు. ఇక్కడ నిర్మాణ వ్యర్థాలను, చెత్తను వేస్తుండటం మొదలు పెట్టిన పదేళ్ల క్రితమే తాము డెబ్రీస్ వేయటాన్ని వ్యతిరేకించగా, ఇది తాత్కాలికమేనని, త్వరలోనే దీన్ని కుత్బుల్లాపూర్ సీ అండ్ డీ ప్లాంటుకు తరలించి, రీ సైక్లింగ్ చేసి నామమాత్రపు ధరలకే విక్రయించనున్నట్లు చెప్పారని పలువురు స్థానికులు తెలిపారు. కానీ ఇపుడు ఈ డెబ్రీస్ గుట్టపై ఫిర్యాదులు చేసినా, కనీసం పట్టించుకునే నాధుడే కరవయ్యాడని స్థానికులు తెలిపారు.
కేవలం నిర్మాణ వ్యర్థాలే గాక, ప్లాస్టిక్ వ్యర్థాలు, హౌజ్ హోల్డ్ గార్బేజీను కూడా ఇక్కడే వేస్తున్నట్లు కూడా గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. ఇతర చెత్తను కూడా స్థానికంగా కొందరు ఇక్కడ పడేస్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గాలి దుమారం వచ్చినప్పుడల్లా ఈ కుప్పల నుంచి దుమ్ము, చెత్త ఎగిరి రోడ్లపై పడుతోంది. దీంతో చుట్టుపక్కల కాలనీలు, ఐటీ ఆఫీసులకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి దుమ్మూ, దూళి చేరటంతో చిన్నారులు చాలా ఇబ్బందలు పడుతున్నట్లు కూడా పేర్కొన్నారు.
డెబ్రీస్ కుప్పల వల్ల వాయు కాలుష్యం కూడా పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ దుమ్మూ, దూళి కారణంగా శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. చెత్త కుప్పల నుంచి వస్తున్న దుర్వాసనతో కాలనీవాసులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ సిటీ లాంటి ప్రీమియం ప్రాంతంలో ఇంత భారీగా చెత్త పేరుకుపోయినా అధికారులు ఏళ్ల తరబడి పట్టించుకోవటం లేదని, ఫలితంగా ఎండాకాలం ఎండలు బాగా మండిపనపుడు ఆ గుట్టలోని ప్లాస్టిక్ కలిగి రసాయన భరితమైన వాసన రావటంతో వాహనదారులు కూడా ఉక్కిబిక్కిరి అవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.
Also read: ఇంటర్నెట్ను ఊపేస్తున్న రజనీకాంత్ పాత బస్ కండక్టర్ ఐడీ కార్డ్!
ఈ డెబ్రీస్ గుట్ట మొత్తాన్ని పూర్తిగా తొలగించాలంటే సుమారు రూ. 90 కోట్ల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దుండిగల్లో ఉన్న సీ అండ్ డీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ కు ఈ చెత్తను తరలించి సైంటిఫిక్గా డిస్పోజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే 15 మెట్రిక్ టన్నుల ఈ డెబ్రీస్ ను తరలించడం అధికారులకు పెద్ద చాలెంజ్ గా మారిందని తెల్సింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం నుంచి ట్రక్కులు డే టైమ్ లో నడిస్తే రకరకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని, కేవలం రాత్రి వేళ్లలో మాత్రమే తరలించాలంటే సుమారు ఏడాది సమయం పడుతుందని అధికారులు అంఛనాలేస్తున్నారు. అయితే ఇక్కడే ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసి డెబ్రిస్ రీ సైక్ల్లింగ్ చేస్తే మొత్తం ఐటీ కారిడార్ లోనే భారీగా వాయు కాలుష్య ఏర్పడే ప్రమాదం లేకపోలేదని కూడా అధికారులు అంచనాలేస్తున్నారు.
కోర్ అర్బన్ రీజియన్ మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి.సృజన ఈ డెబ్రీస్ గుట్టను సందర్శించిన తర్వాత కూడా ఇక్కడ చెత్తా చెదారం, నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేయటం ఆగటం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు హైటెక్ సిటీకి మరిన్ని ఐటీ సంస్థలు పెట్టుబడులు పెట్టి, తమ క్యాంపస్ లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకునే దిశగా సర్కారు ప్రయత్నాలు చేస్తుంటే, స్థానిక అధికారుల కొద్ది పాటి నిర్లక్ష్యం ఈ ప్రయత్నాన్ని దెబ్బతీసే అవకాశముందన్న వాదనలున్నాయి. తెస్తున్న ఈ చెత్త కుప్పలను వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా అక్రమ డంపింగ్పై కఠిన చర్యలు తీసుకుని,భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు వద్దు.. ఏపీ పోలీసులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు!