Tree Cutting: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ పేరుతో విద్యుత్ అధికారులు భారీగా చెట్లను నరికివేస్తుండటంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసి హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంపొందించేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటుతుండగా, మరోవైపు ప్రభుత్వ శాఖలే చెట్లను విచక్షణారహితంగా నరికి వేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రధాన రహదారులు, కాలనీలు, నివాస ప్రాంతాల్లో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్నాయనే పేరుతో చెట్ల కొమ్మలను మాత్రమే కాకుండా పూర్తిగా చెట్లను నేలమట్టం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెరిగిన చెట్లు క్షణాల్లో కూల్చివేయడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో ప్రజలకు నీడనిచ్చే చెట్లు లేకుండా పోతుండటంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని అంటున్నారు. ప్రత్యేకించి ఇటీవల పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో చెట్ల ప్రాధాన్యత మరింత పెరిగిందని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. అలాంటి సమయంలో ముందస్తు ప్రణాళిక లేకుండా చెట్లను భారీగా నరికి వేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ఒక చేత్తో మొక్కలు నాటి.. మరో చేత్తో చెట్లు నరుకుతున్నారా?” అంటూ ప్రభుత్వ తీరుపై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు.విద్యుత్ శాఖ అధికారులు మాత్రం ప్రజల భద్రత కోసమే ఈ చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. వర్షాకాలంలో చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లపై పడితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని వివరిస్తున్నారు. అయితే అవసరమైన మేరకే కొమ్మలను తొలగించాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా చెట్లను నరికివేయడం సరైంది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడమే ఇలాంటి పరిస్థితులకు కారణమని సామాజికవేత్తలు అంటున్నారు.
జీహెచ్ఎంసీ, అటవీ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు కలిసి శాస్త్రీయ పద్ధతిలో చెట్ల కొమ్మలను కత్తిరించే విధానాన్ని అమలు చేయాలని సూచిస్తున్నారు. అవసరం లేని నరికివేతలను అరికట్టడంతో పాటు నరికిన ప్రతి చెట్టుకు ప్రత్యామ్నాయంగా కొత్త మొక్కలు నాటాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే సాధారణ ప్రజలు చిన్న స్థాయిలో చెట్లు నరికినా అటవీ శాఖ అధికారులు వెంటనే నోటీసులు జారీ చేసి ఇబ్బందులకు గురిచేస్తారని, అలాంటిది ఇప్పుడు పదుల సంఖ్యలో చెట్లు నరికివేస్తున్నా అటవీ శాఖ అధికారులు అటువైపు చూడకపోవడంపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “సామాన్యులకో న్యాయం.. అధికారులకో న్యాయమా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ విషయంపై మేడ్చల్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీవాణి స్పందిస్తూ.. విద్యుత్ అధికారుల నుంచి తమ శాఖకు ఎలాంటి ముందస్తు సమాచారం అందలేదని తెలిపారు. ఈ వ్యవహారాన్ని జిల్లా అటవీ అధికారి (DFO) దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు.
Also Read: మేడ్చల్లో అక్రమ నిర్మాణాల మాఫియా.. పట్టించుకోని అధికారులు