Medchal ORR: స్వేచ్ఛ బ్యూరో: వర్షం నుంచి ప్లైవుడ్ లోడును రక్షించేందుకు లారీపైకి ఎక్కి టార్పాలిన్ కడుతున్న వ్యక్తి.. మరో భారీ లారీ ఢీకొట్టడంతో కిందపడి మృతిచెందాడు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి ప్లైవుడ్ లోడుతో మియాపూర్ వెళ్తున్న టీఎస్05 యూసీ 2959 నంబర్ లారీని వర్షం కారణంగా తెల్లవారుజామున రోడ్డుపక్కన నిలిపారు. ప్లైవుడ్ తడవకుండా ఉండేందుకు బీహారీ రాయ్ (35) లారీపైకి ఎక్కి టార్పాలిన్ కడుతున్నాడు.అదే సమయంలో కీసర నుంచి తెల్లాపూర్ వైపు క్రషర్ లోడుతో వెళ్తున్న టీజీ07 ఎక్స్5510 నంబర్ గల 16 టైర్ల భారీ లారీ వెనుక నుంచి వచ్చి నిలిపి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది.
Also read: పోలీసులను ఆశ్రయించిన మాధురి రాథోడ్.. పరారీలో ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి!
ఢీకొట్టిన తీవ్రతకు లారీపై ఉన్న బీహారీ రాయ్ కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్.. ఉచిత రిజిస్ట్రేషన్లతో పేదలకు అపార్ట్మెంట్లు!