Minister Sridhar Babu: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి శ్రీధర్ బాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గత ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్థిక ఆరాచకానికి పాల్పడిందని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా కేటీఆర్ ఆలోచనా విధానంలో మార్పు రావడం లేదని మండిపడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ఇండస్ట్రీయల్ పాలసీపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, సత్యదూరమైన మాటలు మాట్లాడటం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు పారిశ్రామికవేత్తలను బెదిరింపులకు గురిచేస్తున్నారని మంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు.
లీజు భూములను ఫ్రీ హోల్డ్ చేసే అంశంపై కేటీఆర్ అజ్ఞానంతో మాట్లాడుతున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. వాస్తవానికి లీజు భూములను ఫ్రీ హోల్డ్ చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జీవోలు తెచ్చిందని, తాము వాటిని అమలు చేస్తూ అదనంగా ‘ఇంపాక్ట్ ఫీజు’ను చేర్చామని స్పష్టం చేశారు. కేటీఆర్ చెబుతున్నట్లు అది 30 శాతం భూమి విలువ కాదని, కేవలం కన్వర్షన్ ఫీజు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. ఫ్రీ హోల్డ్కు, లీజు భూములకు లింక్ పెడుతూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, సొంత భూములు ఉన్నవారు నిబంధనల ప్రకారం కన్వర్షన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కన్వర్షన్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 4 వేల నుంచి 5 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగడం బీఆర్ఎస్కు ఇష్టం లేదని, అందుకే అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత ఆ పార్టీ నేతలకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని సెటైర్లు వేశారు. ఇక ఎంవోయూల విషయంలో కేటీఆర్ పేర్కొన్న పేర్లు కలిగిన వ్యక్తులు ఎవరూ ప్రభుత్వంలో లేరని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని, కేటీఆర్ చెప్పినట్లు ఎవరైనా అక్రమంగా ఎంవోయూలు చేసుకున్నట్లు నిరూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సవాల్ విసిరారు. ఇప్పటికైనా కేటీఆర్ గాలి మాటలు కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.
Read Also: IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ బదిలీలు.. కీలక బాధ్యతల్లో కొత్త అధికారుల నియామకం