Minister Sridhar Babu: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అనుకూలమైన వాతావరణం ఉండటంతో హైదరాబాద్ జీసీసీలకు హబ్ గా మారుతోందన్నారు. ప్రస్తుతం నగరంలో 355 జీసీసీలుండగా, 3 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.
ప్రముఖ దిగ్గజ కంపెనీలు కొత్తగా తమ జీసీసీలను ఇక్కడ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగంలో ఏర్పాటవుతున్న జీసీసీల సంఖ్య పెరుగుతుందన్నారు. బీఎఫ్ఎస్ఐ కన్సార్షియం, ఎక్విప్ సహకారంతో స్కిల్ యూనివర్సిటీ ద్వారా బీఎఫ్ఎస్ఐ జీసీసీలకు అవసరమైన నైపుణ్యమున్న మానవ వనరులుగా తెలంగాణ యువతను తీర్చి దిద్దాలని సంకల్పించామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా బీఎఫ్ఎస్ఐ – స్కిల్లింగ్ పేరిట ప్రత్యేక ప్రోగ్రాం ను ప్రారంభించినట్లుగా చెప్పారు. ఏటా 10వేల మంది బీటెక్, డిగ్రీ పట్టభద్రులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మూడేళ్లలో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
బీటెక్ పాసైన స్టూడెంట్స్కు నాలుగు నెలల పాటు బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్ వేర్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తర్ఫీదునిస్తామన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ప్లేస్ మెంట్స్ పొందేలా సహకరిస్తామన్నారు. ఈ కోర్సు కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని, కేవలం సర్టిఫికేట్, ఇతర అడ్మినిస్ట్రేటివ్ అవసరాలకు ఒక్కసారి రూ.5వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ కోర్సులో శిక్షణ పొందేందుకు అర్హులైన అభ్యర్థులను ప్రత్యేక పరీక్షను నిర్వహించి ఎంపిక చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పుకొచ్చారు.
Also Read: BEL Recruitment: బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే ఛాన్స్..
ఈ దఫా కోర్సుకు 1320 మంది బీటెక్ పట్టభద్రులు రిజిస్టర్ చేసుకున్నారన్నారు. వీరందరికి ఆదివారం గచ్చిబౌలీలోని ఇంజినీరింగ్ స్టాఫ్ ఆఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా(ఈఎస్ఐసీ) ప్రాంగణంలో పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నామన్నారు. ఉద్యోగాలు కోసం ప్రయత్నిస్తున్న పట్టభద్రులు స్కిల్స్ యూనివర్సిటీ వెబ్ సైట్( yisu.in )ను తరచూ సందర్శించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు.