Thummala Nageswara Rao: దేశానికి అధికంగా ఆదాయం సమకూర్చుతున్న దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక విధానాలతో అన్యాయానికి గురవుతున్నాయని, ఇది కేవలం ఆర్థిక వివక్షే కాదు… రాజకీయ ఉద్దేశంతో కూడిన వివక్ష అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) మండిపడ్డారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. వికసిత్ భారత్ అనే నినాదం ఇస్తూ దేశ అభివృద్ధిపై గొప్పలు చెప్పుకుంటున్న కేంద్రం, దక్షిణాది రాష్ట్రాలపై ముఖ్యంగా తెలంగాణ విషయంలో స్పష్టమైన వివక్ష, నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తోందన్నారు. 2018–19 నుంచి 2022–23 వరకు దేశవ్యాప్తంగా కేంద్రం వసూలు చేసిన మొత్తం పన్నులు రూ.90.80 లక్షల కోట్లు అయితే, ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుంచే పైగా రూ.22.86 లక్షల కోట్లు వచ్చాయన్నారు.
కేంద్రం తిరిగి దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు మాత్రం కేవలం 16.3 శాతం మాత్రమే అన్నారు. ఇది ఆర్థిక సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నులు చెల్లించిన ప్రతి రూపాయికి తిరిగి వచ్చే నిధులను పోల్చితే కేంద్రం పాటిస్తున్న ద్వంద్వ వైఖరి బయటపడుతుందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు రూపాయికి సగటున 30 పైసలు ఇస్తూ, ఇదే సమయంలో బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ఉత్తరాది రాష్ట్రాలకు రూ.1కి రూ.4 చొప్పున ఇస్తున్నారని, ఇది ఆర్థిక అసమతుల్యతను పెంచడమే కాకుండా, ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలను సృష్టించే ప్రమాదకర ధోరణి అని హెచ్చరించారు.2024-25 లో తెలంగాణ రాష్ట్రం నుంచి 1,33,208 కోట్ల పన్నులు వసూలు అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి కేంద్రం పన్నుల రూపంలో 27,050 కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో 7,913 కోట్లు, కేంద్ర ప్రాయోజిక పథకాల రూపంలో 16,762 కోట్లు మొత్తంగా 51,725 కోట్లు విడుదల చేసినట్టు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి సమాధానం చెప్పారన్నారు.
Also Read: Thummala Nageswara Rao: మీ రాజకీయాల కోసం రైతులను రెచ్చగొట్టొద్దు.. బీఆర్ఎస్ పై మంత్రి తుమ్మల ఫైర్..!
జీఎస్టీ సవరణలతో తెలంగాణ ఇప్పటికే ఏడాదికి సుమారు రూ.8 వేల కోట్లు నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక 15వ ఆర్థిక సంఘం సూచించిన రెవెన్యూ లోటు గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కన పెట్టడంతో రాష్ట్రాల ఆర్థిక స్వాతంత్య్రం దెబ్బతిన్నదని విమర్శించారు. రంగాలవారీగా, రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకు కత్తెర పెట్టడం వల్ల తెలంగాణకు మరో రూ.5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.ఇది కేవలం లెక్కల విషయం కాదు. ఇది కేంద్రంలో ఉన్న పాలకుల రాజకీయ ఆలోచనల ఫలితం అని మండిపడ్డారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు భాగస్వాములే కాని, కేంద్రం దయాధర్మాలపై ఆధారపడేవి కావని స్పష్టం చేశారు. దేశ సమగ్ర అభివృద్ధి సాధించాలన్న, కేంద్రం చెప్పుకుంటున్న వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని, ముఖ్యంగా ఆదాయం సమకూర్చే రాష్ట్రాలపై వివక్ష మానుకోవాలని కేంద్రాన్ని కోరారు.
తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించే బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పదేళ్లలో ఏనాడు ప్రశ్నించకపోగా, రాష్ట్రానికి అన్ని తెచ్చాం, ఇన్ని చేశాం, రాష్ట్ర ఖజానాకు కేంద్రమే పూర్తి నిధులు సమకూరుస్తుందనట్లు మాట్లాడటం వారి పతనానికి నాంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ, రైతు భరోసా, పంట కొనుగోళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో భారీగా ఖర్చు చేస్తోందని, కానీ కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన వాటా రాకపోవడం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీలు తెలంగాణకు రావాల్సిన న్యాయబద్దమైన వాటాకోసం కేంద్రంతో పోరాడటానికి మాతో కలిసి రావాలని కోరారు.
Also Read: HYDRAA: రూ.1511cr విలువైన భూమి సేఫ్.. ఇది కదా హైడ్రా పవర్ అంటే, ఎలా సేవ్ చేశారంటే..?