Minister Vakiti Srihari: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున భగవాన్ పరమేశ్వరుడి ఆశీస్సులతో రాష్ట్రంలో సుఖశాంతులు, సమృద్ధి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. మహాశివరాత్రి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఉపవాసం, జాగరణ, భక్తి భావంతో శివారాధన చేయడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని అన్నారు.
సమాజంలో ఐక్యత, సహనం, పరస్పర గౌరవం పెంపొందించడం ఈ పండుగ ప్రధాన సందేశమని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ, సమాజంలో సత్సంబంధాలు, శాంతి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ప్రజలు పండుగను ప్రశాంతంగా, భద్రతా నియమాలు పాటిస్తూ జరుపుకోవాలని, దేవాలయాలకు వెళ్లే భక్తులు క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. యువత మద్యం, అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని మంత్రి సూచించారు.