![Kadiyam Srihari Comments](https://www.bigtvlive.com/wp-content/uploads/2024/04/KADIUM-1280-x-720.jpg)
kadiyam srihari Comments On BRS Leaders: స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవకాశవాది అని ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విమర్శలకు కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. తాను అవకాశవాదిని కాదని స్పష్టం చేశారు. అవకాశాలే తన వద్దకు వచ్చాయని తెలిపారు.
వరంగల్ లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థిగా కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు తొలుత బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చింది. అభ్యర్థిగా ప్రకటించినా ఆమె ప్రచారంపై అంత ఆసక్తి చూపించలేదు చివరికి బీఆర్ఎస్ గుడ్ బై చెప్పారు. తండ్రితో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా కడియం కావ్యకు కాంగ్రెస్ టిక్కెట్ దక్కింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కడియం ఫ్యామిలీని టార్గెట్ చేశారు. ఆ విమర్శలను కడియం శ్రీహరి తనదైన శైలిలో తిప్పికొట్టారు.
కాంగ్రెస్ ఆహ్వానంతోనే ఆ పార్టీలో చేరామని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్లో కేసీఆర్ తనకు రాజకీయంగా ఎన్నో అవకాశాలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇటీవల బీఆర్ఎస్ను చాలా మంది నేతలు వీడారని .. కానీ తననే ఎక్కువ టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య.. ప్రకటించిన కాంగ్రెస్..
బీఆర్ఎస్లో కొందరు నేతల తీరుపైనా కడియం శ్రీహరి మండిపడ్డారు. పల్లా రాజేశ్వరరెడ్డి గులాబీ పార్టీకి చీడపురుగు మాదిరిగా తయారయ్యారని ఆరోపించారు. తనను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసే హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని స్పష్టం చేశారు.
బీజేపీపైనా కడియం శ్రీహరి విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను కేసుల్లో ఇరికించి ఈడీ, సీబీఐ సంస్థలతో దర్యాప్తు చేయిస్తోందని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు కాషాయ కండువాలు కప్పుకోగానే పునీతులతున్నారా ? అని ప్రశ్నించారు. బీజేపీ అరాచకాలను నిలువరించేందుకే కాంగ్రెస్లో చేరానని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో ఉంటే నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించలేమన్నారు.