MLA Kaushik Reddy: స్వేచ్ఛ బ్యూరో: తాను బతికుండగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డంపింగ్ యార్డ్ పెట్టనిచ్చే ప్రసక్తి లేదని, ప్రజల ఆరోగ్యం కోసం ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన సిర్సపల్లి సమీపంలోని డంపింగ్ యార్డ్ ప్రతిపాదిత స్థలాన్ని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఇది ప్రజల జీవన్మరణ సమస్య అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ యార్డ్ ఏర్పాటయితే ప్రజలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమవుతుందని, రైతులు, మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. పర్యావరణం దెబ్బతినడమే కాకుండా పశుపక్షాదుల ఉనికి కూడా ప్రశ్నార్థకమవుతుందని, అందుకే ప్రజలందరూ ముక్తకంఠంతో ఈ ప్రాజెక్టును వద్దని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రికి దండం పెట్టి మరీ హుజురాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని కోరానని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు. “నాపై కోపం ఉంటే నన్ను ఉరి తీయండి, జైలుకు పంపండి.. కానీ నా నియోజకవర్గ ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు” అని ఆయన ఉద్వేగంగా అన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ఈ డంపింగ్ యార్డును ప్రతిపాదించారని చెబుతూ, అందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఆయన మీడియా ముందు చదివి వినిపించారు. ఈ విషయంలో ఎవరూ బురద చల్లే ప్రయత్నం చేయవద్దని, ప్రభుత్వం వెంటనే ఈ ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తాను ముఖ్యమంత్రితో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు లేఖలు కూడా రాసినట్లు వివరించారు.
Also Read: మీ ఆధార్తో వేరే వాళ్లు సిమ్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ఫుల్..!
ప్రభుత్వం గనుక డంపింగ్ యార్డ్ ప్రతిపాదనను రద్దు చేయకపోతే, ఈ నెల 7, 8 తేదీలలో తాను స్వయంగా జేఏసీ శిబిరంలో దీక్షకు దిగుతానని ఎమ్మెల్యే ప్రకటించారు. 7వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతుందని వెల్లడించారు. అంతకంటే ముందే, ఏప్రిల్ 3వ తేదీన చేపట్టే హుజురాబాద్ బంద్ను రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోలీసులు బంద్ను అడ్డుకోవాలని చూడవద్దని, ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
ఈ డంపింగ్ యార్డ్ కమ్ ఎనర్జీ ప్లాంట్ పనులకు కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు వేయవద్దని, వేస్తే కచ్చితంగా అడ్డుకుంటామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ జవహర్ నగర్ ప్లాంట్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఉదాహరణగా చూపుతూ, హుజురాబాద్ ప్రజలకు అలాంటి కష్టం రానివ్వబోమని తేల్చి చెప్పారు. దవాఖానాలు, మెడికల్ షాపులు మినహా మిగిలిన అన్ని వ్యాపార సంస్థలు బంద్కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Also Read: గ్రేటర్ ఎన్నికలు ఇక లేనట్టేనా.. జనగణన సాకుతో సర్కార్ అసలు ప్లాన్ ఇదేనా..!