MLC Kavitha: తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కాయి. అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికివారు సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ-బీఆర్ఎస్ మధ్య ‘పసుపు’ రాజకీయం మొదలైంది. నిజామాబాద్కు పసుపు బోర్డు తమ వల్లే వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తోంది కారు పార్టీ.
సంక్రాంతి రోజున నిజామాబాద్ జిల్లాలో జాతీయ జాతీయ పసుపు బోర్డును ప్రారంభిం చారు కేంద్రమంత్రి పియూష్ గోయల్. దీనికి ఛైర్మన్గా ఆ పార్టీ నేత గంగారెడ్డిని ప్రకటించారు. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్నది ఆ ప్రాంత రైతుల చిరకాల కోరిక. ఎన్నికలు వచ్చాయంటే చాలు నిజామాబాద్లో పసుపు బోర్డు చుట్టూనే రాజకీయాలు తిరుగుతాయి.
ఆదివారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. పనిలో పనిగా పసుపు బోర్డు వ్యవహారంపై నోరు విప్పారు. పసుపు బోర్డును స్వాగతిస్తున్నామని చెప్పిన ఆమె, ఆ ప్రకటన బీజేపీ కార్యక్రమం మాదిరిగా ఉందన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా బోర్డు ప్రకటించారని మండిపడ్డారు.
బోర్డు రావడంతో సంపూర్ణం కాదని, రైతులను మద్దతు ధర 15 వేలు రావాలన్నది ఆమె డిమాండ్. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఐదేళ్లపాటు పార్లమెంట్లో పసుపు బోర్డు పోరాటం చేశానని గుర్తు చేశారు. పసుపు బోర్డు కోసం 25 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశానని, కేంద్రంపై చేసిన ఒత్తిడి కారణంగా బోర్డు వచ్చిందన్నది ఆమె మాట.
ALSO READ: సింగపూర్ కంపెనీతో కీలక ఒప్పందం.. కొత్త ఐటీ పార్క్
తాము పసుపు బోర్డు డిమాండ్ చేసినప్పుడు ఎంపీ అరవింద్ రాజకీయాల్లో లేరన్నారు కవిత. మా ప్రభుత్వ హయాంలో స్పైస్ పార్క్ ఏర్పాటైందన్నారు. ఇందుకోసం వేల్పూర్లో 42 ఎకరాలు కేటాయించామని వివరించారు. పసుపు బోర్డు అవసరం లేదని, స్పైస్ బోర్డు చాలని ఆనాడు ఎంపీ అరవింద్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో బంగారం మారిదిగా పసుపు ధర ప్రతీ ఏటా పెరుగుతోందన్నారు.
పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదన్నది కవిత సూటి ప్రశ్న. నిజంగా రైతులకు మేలు చేసే ఉద్దేశం కేంద్రానికి ఉంటే పసుపుకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎగుమతుల కోసం నిజామాబాద్కు ఎయిర్పోర్టు తీసుకురావాల్సిన బాధ్యత ఎంపీ అరవింద్పై ఉందన్నారు కవిత. ఆమె కామెంట్స్పై ఎంపీ ఏ విధంగా రియాక్టు అవుతారో చూడాలి.