MP Arvind: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకేసారి ఢిల్లీ పర్యటనలో ఉండటం వెనుక పెద్ద కథే ఉందంటూ ఎంపీ అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరినీ ‘తోడు దొంగలు’ అని సంబోధిస్తూ.. కుటుంబ ఆదాయాలు పెంచుకోవడం, రాష్ట్రాన్ని దోచుకోవడమే లక్ష్యంగా ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్ ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తంపై సీబీఐ విచారణ కోరకుండా, కేవలం మూడు డ్యామ్ల పైనే విచారణ అడగటం వెనుక ఇద్దరి అవగాహన ఉందని ఆరోపించారు.
‘జెన్ జీ’పై విమర్శలు
ఏటా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులను ఫీజు రీయింబర్స్మెంట్ పేరిట మోసం చేస్తున్నారని ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. కాలేజీలు మూతపడుతున్నా పట్టించుకోకుండా, రేవంత్ రెడ్డి, కేటీఆర్లు ‘జెన్ జీ’ గురించి ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. గత 12 ఏళ్లుగా తెలంగాణలో సరియైన జాబ్ క్యాలెండర్ లేదని, అసలు విద్యాశాఖపై ఏమాత్రం అవగాహన లేని రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారన్నారు.
ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లేదా యశస్విని రెడ్డిలలో ఒకరిని విద్యాశాఖ మంత్రిగా నియమించాలని, లేదంటే మొదట ‘జెన్ జీ’కే ఆ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 62 ఏళ్ల వయస్సు ఉన్నవారిని కేబినెట్లో పెట్టుకుని జెన్ జీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
హామీలు, విచారణలపై ప్రశ్నల వర్షం
రేవంత్ రెడ్డి నుంచి మంచి పాలన వస్తుందని ఆశించామని, కానీ ఆయనా పాత కుటుంబ పాలననే కొనసాగిస్తూ దోపిడీదారులను కాపాడుతున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్, ఈ-ఫార్ములా కార్ రేస్ కేసు, విద్యుత్ కొనుగోళ్ల స్కామ్ విచారణలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ ఇప్పటివరకు రాజకీయాలపై ఏమాత్రం ఫోకస్ పెట్టలేదని, ఆయన ఎప్పటికీ ప్రధాని కా లేరని అరవింద్ స్పష్టం చేశారు. కాగా, తెలంగాణలో విద్యార్థుల సమస్యలపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో లక్షల మందితో భారీ ఆందోళన చేపట్టబోతున్నట్లు ఈ సందర్భంగా ఎంపీ వెల్లడించారు.
Also Read: కోనసీమ జిల్లాలో దారుణం.. భారీ వర్షానికి ఇంటి స్లాబ్ కూలి మహిళ మృతి!