MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర, కేంద్ర రాజకీయాలతో పాటు స్థానిక రైతాంగ సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి, ప్రస్తుత కాంగ్రెస్ పాలన , గత బీఆర్ఎస్ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు.
రాజకీయ విమర్శలు
ఈనెల 10వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రూ. 8 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని అరవింద్ వెల్లడించారు. ఇదే క్రమంలో కేసీఆర్ తీరుపై మండిపడుతూ.. ఆయనకు మతి భ్రమించిందని, తనను నమ్మిన నాయకులను మోసం చేయడం కేసీఆర్కు అలవాటని విమర్శించారు. తాజాగా బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డిని కూడా ఆయన వదిలిపెట్టరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ శకం ముగిసిందని, ప్రజలు ఆయన్ని పట్టించుకోవడం మానేశారని చెబుతూనే, గ్రామీణ స్థాయి వరకు మత్తు పదార్థాలను చేరవేసిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆరోపించారు.
రైతాంగ సమస్యలు – బీజేపీ అల్టిమేటం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలనపై పట్టు లేదని అరవింద్ విమర్శించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘రైతు పండించిన ప్రతి గింజాను వారం రోజుల్లోగా కొనుగోలు చేయాలి’ అని బీజేపీ తరపున ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో రైతాంగం నుండి పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.
పసుపు రైతులు – మోదీ చొరవ
నిజామాబాద్ పసుపు రైతుల గురించి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాల వల్లనే పసుపు రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర లభిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు వేయడం, మార్కెట్ ధరలు పెరగడంలో కేంద్రం పాత్ర కీలకమని అరవింద్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: ఢిల్లీలో చిప్ప పట్టుకుని తిరుగుతున్నారు.. కాంగ్రెస్ నేతలపై ఎంపీ ఫైర్!