Chamala Kiran Kumar Reddy: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ చనిపోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ కోరుకోరని, ఒకవేళ కేసీఆర్ అడ్డు తొలగాలని ఎవరైనా భావిస్తే అది కేవలం ఆయన కుటుంబంలోని కేటీఆర్, హరీష్ రావులేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం సీటు కోసం కేటీఆర్, పార్టీని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి హరీష్ రావు తహతహలాడుతున్నారని, వీరి అధికార దాహానికి అడ్డు వస్తుందనే కవితను కూడా బయటకు పంపించారని ఆరోపించారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గత పదేళ్లుగా జరిగిన దోపిడీని, కమిషన్ల కక్కుర్తిని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్ష్యాలతో సహా బయటపెట్టడంతో బావ, బామ్మర్దులకు మింగుడుపడటం లేదని ఎద్దేవా చేశారు. దొంగలు అడ్డంగా దొరికిపోవడంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్పై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు స్వయంగా వెళ్లి పరామర్శించిన సంస్కారం రేవంత్దని, ఆయన అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే అసెంబ్లీకి రావాలని కోరారని గుర్తుచేశారు.
కేసీఆర్ రావణుడిలా పాలించడం వల్లే ప్రజలు రేవంత్ను సీఎంగా ఎన్నుకున్నారని, ఒకవేళ కేసీఆర్ మంచి పాలన అందించి ఉంటే ఆయనే అధికారంలో ఉండేవారని చామల విశ్లేషించారు. కేసీఆర్ బతికి ఉంటేనే గత పదేళ్ల పాపాలు బయటపడతాయని, అందుకే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందన్నారు. తెలంగాణ యాసలో రేవంత్ మాట్లాడే మాటలను వక్రీకరిస్తూ.. పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పడం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో మాయ చేయడం హరీష్, కేటీఆర్లకు అలవాటుగా మారిందని, ప్రజలు ఈ వాస్తవాలను గమనించాలని ఎంపీ కోరారు.
Read Also: సభ నుంచి పారిపోతారా? ఇది ముమ్మాటికీ తప్పే: BRSపై కవిత సంచలన వ్యాఖ్యలు!