హైదరాబాద్లో నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చారు. నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కీలక ఆదేశాలు జారీ చేశారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
నగరంలో ఈవెంట్లను నిర్వహించే ఆర్గనైజర్లు తప్పనిసరిగా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని డీసీపీ స్పష్టం చేశారు. ఇప్పటివరకు బంజారాహిల్స్ పరిధిలో కేవలం ముగ్గురు నిర్వాహకులు మాత్రమే అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ఈవెంట్ నిర్వహించే ప్రదేశాల్లో పార్కింగ్ సమస్య తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, ఒకవేళ సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఏవైనా ప్రమాదాలు జరిగితే పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని తేల్చి చెప్పారు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వారి విషయంలో పోలీసులు జీరో టొలరెన్స్ పాటిస్తారని రాహుల్ హెగ్డే పేర్కొన్నారు. వేడుకల అనంతరం మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ఇందుకోసం ప్రతి ఈవెంట్ వద్ద నిర్వాహకులే ప్రత్యేకంగా డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని.. మత్తులో ఉన్న వారు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా చూడాల్సిన బాధ్యత వారిపైనే ఉందని తెలిపారు.
న్యూ ఇయర్ రాత్రి రోడ్లపై బైక్ రేసింగ్లు, ప్రమాదకరమైన స్టంట్లు చేసే వారిపై డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిఘా ఉంచినట్లు డీసీపీ వెల్లడించారు. ముఖ్యంగా యువత ఉత్సాహంలో అతివేగంతో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు ఇబ్బంది కలిగిస్తే భారీ జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఫ్లై ఓవర్ల మూసివేత, ట్రాఫిక్ మళ్లింపులపై త్వరలోనే పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేస్తామన్నారు. ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా.. సురక్షితంగా జరుపుకోవాలని ట్రాఫిక్ విభాగం కోరుతోంది.
ALSO READ: Tamil Nadu: తండ్రికి రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్.. పాముకాటుతో చంపి.. ఎలా దొరికారంటే..?