Turmeric Board : తెలంగాణ పసుపు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న పసుపు బోర్డు ఏర్పాటులో కీలక ముందడుగు వేసింది. జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తు నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రం.. ఛైర్మన్ గా పల్లె గంగారెడ్డిని ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఈ పదవిలో మూడేళ్ల పాటు ఉండనున్నారు.
రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ ఉంది. ఇప్పటి వరకు పసుపు కోసం ప్రత్యేక బోర్డు లేని నేపథ్యంలో.. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల నుంచి బలమైన డిమాండ్ ఉంది. ఒకానొక దశలో పసుపు రైతులు రాజకీయంగానూ ఈ అంశాన్ని చాలా తీవ్రమైన అంశంగా మార్చారు. ఎంపీ ఎన్నికల్లో వందల మంది నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీలో నిలుచుని.. అక్కడ ఫలితాల్ని తారుమారు చేశారు. ఈ నేపథ్యంలో.. గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని ప్రకటించిన కేంద్రం.. తాజాగా అందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది.
నిజామాబాద్ రైతుల దశాబ్దాల నాటి కలను నెరవేర్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. రేపు పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారు. మన దగ్గర వినియోగం, ఇతర దేశాలకు ఎగుమతుల్లోనూ మనమే ముందు వరుసలో ఉన్నాం. అంతర్జాతీయ పసుపు ఉత్పత్తి ఏడాదికి దాదాపు 11 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. అందులో భారత్ వాటానే 78% ఉంటుంది. మన తర్వాత చైనా 8%, మయన్మార్ 4% సహా.. నైజీరియా, బంగ్లాదేశ్ వంటి మిగతా దేశాలున్నాయి. ఇక తెలంగాణలో 2023-24లో తెలంగాణ 0.23 లక్షల హెక్టార్లలో 1.74 లక్షల టన్నుల పసుపును ఉత్పత్తి చేశారు మన రైతులు. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్,ఆదిలాబాద్ జిల్లాల్లో పసుపు ఉత్పత్తి అధికంగా ఉంటుంది. ఈ నాలుగు జిల్లాల్లోనే రాష్ట్రంలోని 90%నికి పైగా పసుపు ఉత్పత్తి ఉంటుంది.
ALSO READ : తెలంగాణలో కొత్తగా మరో ఎయిర్పోర్ట్.. ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ను ఎవరూ ఆపలేరు..
ముఖ్యంగా నిజామాబాద్ లో రైతుల నుంచి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గట్టి డిమాండ్ ఉంది. బోర్డు ఏర్పాటు ద్వారా అంతర్జాతీయ మార్కెట్ విలువను అందుకోవడంతో పాటు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. అలాగే.. అంతర్జాతీయ స్థాయిలో జరిగే పరిశోధనలు, ఆధునిక సాంకేతికతల అందుబాటులోకి రానున్నాయి. కేంద్రం నుంచి రైతులకు ప్రత్యేక బోర్డు ఉంటే.. సాయం కూడా లభించే అవకాశాలుండడంతో రైతుల నుంచి బోర్డు ఏర్పాటుకు తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్ కు తలొగ్గుతూ.. గతంలోనే పసుపు బోర్డును ప్రకటించింది. తాజాగా.. ఛైర్మన్ ను నియమిస్తూ, పరిపాలన కార్యాలయాన్ని ప్రారంభించనుంది.
ఇకపై.. నిజామాబాద్ కేంద్రంగా దేశంలోని పసుపు బోర్డు విధులు నిర్వహించనుంది. పసుపు ధరలు, నాణ్యత సహా ఇతర అంశాలు ఇక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. బోర్డు ఛైర్మన్ కూడా ఎంపిక కావడంతో.. త్వరలోనే మిగతా పనులు పట్టాలెక్కనున్నాయి.