Telangana poll nominations(Latest political news telangana): తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య మరో ప్రతిష్టాత్మక పోరుకు తెరలేచింది. మొత్తం 17 లోక్సభ స్థానాలతోపాటు ఓ అసెంబ్లీ సీటుకు గురువారం ఉదయం నోటిఫికేషన్ వెలువడనుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలవుతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మూడు వరకు మాత్రమే నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. మెజార్టీ సీట్ల గెలుపొందాలని మూడు ప్రధాన పార్టీలు ఉవ్విల్లూరుతున్నాయి.
ముఖ్యంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దాదాపు అన్ని సీట్లలో గెలుపొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుండగా, తమ సత్తా నిరూపించుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. గతం కంటే ఎక్కువ స్థానాలను గెలుపొందాలని కమలనాధులు ప్లాన్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ 14 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో మూడు సీట్లను పెండింగ్లో పెట్టింది. వాటిలో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక బీఆర్ఎస్, బీజేపీలు అన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి.. వారు ప్రచారంలో నిమగ్నమయ్యారు.
ఈసారి సిట్టింగ్ ఎంపీలు తొమ్మిది పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ఐదుగురు పార్టీ మారిపోయారు. వీరిలో పలువురు వివిధ పార్టీల నుంచి బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాదాపు 15 సీట్లలో పార్టీ జెండా ఎగురవేయాలని ఆలోచన చేస్తోంది. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు సూచనలు చేస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న గ్యారంటీలతోపాటు కాంగ్రెస్ మేనిఫెస్టో అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇక రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలు సభలకు హాజరుకానున్నారు.
పట్టు నిలుపుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు మాత్రమే బరిలో ఉన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది ముఖ్య, కీలక నేతలు కారు దిగిపోయారు. అధికార కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లిపోయారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత పలువురు నేతలు ఆ పార్టీకి బై బై చెప్పేశారు. ఎలాగైనా పట్టునిలుపుకునేందుకు నాలుగైదు సీట్లు గెలుపొందాలని భావిస్తోంది.
ALSO READ: కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ.. వయనాడ్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి..
ఇక బీజేపీ విషయానికొస్తే.. బలం పెంచుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రెండంకెల సీట్లు సాధించాలని భావిస్తోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది. దీంతో లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఆరాటపడుతోంది. ముగ్గురు సిట్టింగు ఎంపీలు ఈసారి బరిలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులను తీసుకొచ్చి తెలంగాణలో ప్రచారం చేయించాలని కమలనాధుల వ్యూహంగా కనిపిస్తోంది.