NPDCL: ఎన్పీడీసీఎల్ చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది. నిన్నటి దినాన 6,057 మెగావాట్లకు వినియోగం చేరుకుందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. గత ఏడాది మార్చి 11న 5,816 మెగావాట్లు గరిష్ట డిమాండ్ నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అత్యధిక గరిష్ట విద్యుత్ డిమాండ్ 6,057 మెగావాట్లు నమోదైనట్లు స్పష్టంచేశారు. అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించడానికి ముందస్తు ప్రణాళికతో సత్వర చర్యలు చేపట్టినట్లు సీఎండీ వివరించారు.
మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. 35 కొత్త 33/11 కేవీ సబ్స్టేషన్లు, 366 అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, అలాగే 7600 ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్య పెంపు చేపట్టామని తెలిపారు. ఓవర్లోడ్ ఉన్న 33 కేవీ 8 ఫీడర్లను విభజన చేశామని, 1200 కిలోమీటర్ల మేర 33 కేవీ ప్రత్యామ్నాయ లైన్లను ఏర్పాటు చేశామని వివరించారు. లో వోల్టేజీ తగ్గించడానికి 392 కెపాసిటర్ బ్యాంకులు పెట్టామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి తెలిపారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొన్నారు.
Also Read: EV Scooters vs EV Bikes: ఈవీ మార్కెట్ లో సత్తా చాటుతున్న స్కూటర్స్, బైక్స్ ఎందుకు వెనుకబడుతున్నాయి?
ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, లైన్ల పర్యవేక్షణ, లూజ్ లైన్ కనెక్షన్లు సరిదిద్దడం, అవసరమైన మెటీరియల్ సిద్ధంగా ఉంచడం వంటి పనులు ముమ్మరంగా చేపట్టినట్లు వెల్లడించారు. డిమాండ్ ఎంత పెరిగినా సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ, అందుకు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, వేసవికాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయని సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు.
Also Read: Control Room: త్వరలో కోర్ అర్బన్ ఏరియాలో.. ఆరోగ్య సేవలపై స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు