Khammam News: విదేశాల్లో ఉద్యోగం చేసే వ్యక్తి ఉంటే తమ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేందుకు ఉవ్విళ్లూరుతుంటారు పేరెంట్స్. ఎంతైనా కట్న కానుకలు ఇచ్చేందుకు సిద్ధపడతారు. జీవితంలో అమ్మాయి హాయిగా సెటిలవుతుందని భావిస్తుంటారు. మ్యారేజ్ కాగానే అసలు విషయం తెలిసి షాకైన ఉదంతాలు లేకపోలేదు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ఖమ్మం జిల్లా భద్రాచలంలో వెలుగు చూసింది.
భార్యకి నరకం చూపిన అమెరికా అల్లుడు
భద్రాచలంకు చెందిన తాళ్లూరి ప్రవీణ్ రాజా అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. బంధువుల ద్వారా అతడిని వివాహం సెట్టయ్యింది. పకాలపాటి పూజితతో ప్రవీణ్కు నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అల్లుడికి ఇవ్వాల్సిన లాంఛనాలు అత్తారింటివారు ఇచ్చారు. మ్యారేజ్ తర్వాత పూజిత అమెరికా వెళ్లింది.ఇద్దరూ అక్కడే ఉద్యోగం చేసేవారు. మొదట్లో ఆ దంపతులు బాగానే ఉండేవారు.
పెళ్లి తర్వాత పూజితకు మానసిక, శారీరక వేధింపులు మొదలయ్యాయి. పూజిత వెళ్లిన ఆరు నెలల తర్వాత అక్కడికి అత్తమామలు వెళ్లారు. అక్కడి నుంచి ఆమెకు నరకం మొదలైంది. అటు తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పలేక నరకం అనుభవించింది. రోజురోజుకూ భర్త, అత్తమామల నుంచి టార్చర్ పెరగడంతో తట్టుకోలేక పోయింది. తన జీతాన్ని ఆమె అకౌంట్కి కాకుండా భర్త, అత్తమామల ఖాతాలోకి మళ్లించుకున్నారని ఆరోపించింది.
పెళ్లయిన వారం నుంచే
కనీసం ఖర్చులకు డబ్బులు లేకుండా చేస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేశారని వాపోయింది. ఈ విషయాన్ని పేరెంట్స్ దృష్టికి తెచ్చింది. సమస్యలు సర్దుకుంటాయని కూతురికి నచ్చజెప్పారు. చివరకు మార్చి 15న భద్రాచలం పోలీసులకు పూజిత ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
అమెరికాలో ఉద్యోగం కారణంగా పూజిత భర్త రాజా విచారణకు హాజరుకాలేదు. ఇటీవల ఇండియాకు వచ్చాడు టెక్కీ ప్రవీణ్ రాజా. అయితే టెక్కీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలి కుటుంబం మాట. ఈ వ్యవహారంపై పోలీసులను ప్రశ్నించింది బాధితురాలు పూజిత. కనీసం విచారణకు పిలవలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ALSO READ: చాధర్ ఘాట్ కాల్పుల ఘటన, ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
వచ్చేనెల ఒకటిన రాజా తిరిగి అమెరికాకు వెళ్తున్నాడు. ఇప్పటివరకు విచారణకు పోలీసులు పిలవక పోవడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు పూజిత పేరెంట్స్. పోలీసులకు ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ప్రలోభాలకు లొంగిపోయారా? వంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.