Urdu School: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ, క్షేత్రస్థాయిలో కొందరు ఉపాధ్యాయుల అలసత్వం, పర్యవేక్షణ లోపం కారణంగా ప్రభుత్వ పాఠశాలలు ఉనికిని కోల్పోతున్నాయి. హుజూరాబాద్ పట్టణంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల ఇందుకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఆరుగురు ఉపాధ్యాయులు, లక్షలాది రూపాయల జీతాలు.. కానీ పదవ తరగతిలో ఉన్నది కేవలం ఒక్కరంటే ఒక్కరే విద్యార్థి కావడం ఇప్పుడు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు మొత్తం విద్యార్థుల సంఖ్య కేవలం 20 మాత్రమే. తరగతుల వారీగా చూస్తే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది:
పదవ తరగతి: 01 విద్యార్థి
తొమ్మిదవ తరగతి: 03 విద్యార్థులు
ఎనిమిదవ తరగతి: 03 విద్యార్థులు
ఏడవ తరగతి: 04 విద్యార్థులు
ఆరవ తరగతి: 04 విద్యార్థులు
ఈ 20 మంది విద్యార్థులకు బోధించడానికి ఆరుగురు స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఉపాధ్యాయులు ఉన్నారు. మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్, సోషల్, బయోసైన్స్ వంటి సబ్జెక్టులకు నిష్ణాతులైన బోధకులు ఉన్నప్పటికీ, ఒక్కొక్కరి జీతం లక్ష రూపాయలకు పైగా ఉంది. అంటే నెలకు దాదాపు 6 నుండి 7 లక్షల రూపాయల జీతాలు చెల్లిస్తున్న ప్రభుత్వం, కేవలం ఒకరిద్దరికే చదువు చెప్పించడంపై సామాజిక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: OTT Movies: ఓటీటీ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కొత్త సినిమాల స్ట్రీమింగ్ పై కఠిన నిబంధనలు..!
ఇటీవల ఒక స్వచ్ఛంద సంస్థ హుజూరాబాద్ మండలంలోని పదవ తరగతి విద్యార్థుల కోసం అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టింది. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ‘SSC ఎగ్జామినేషన్ కిట్’ (ప్యాడ్, పెన్నులు) మరియు పరీక్షల రోజుల్లో అల్పాహారం, రవాణా ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థికి 700 రూపాయల నగదును అందజేసింది. ఈ పంపిణీ కార్యక్రమంలో మండలం నలుమూలల నుండి విద్యార్థులు తరలిరాగా, పట్టణ కేంద్రంలోని ఈ ఉర్దూ మీడియం పాఠశాల నుండి కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆరుగురు మేధావులైన ఉపాధ్యాయులు ఉన్న స్కూల్ నుండి కేవలం ఒక్కరే SSC పరీక్షకు హాజరుకావడం వారి పనితీరుకు నిదర్శనమని విద్యావేత్తలు మండిపడుతున్నారు.
పట్టణంలోని మామిళ్ళవాడ, జండా గద్దె ఏరియా, గ్యాస్ గోదాం ఏరియాల్లో ఉర్దూ మాట్లాడే మైనారిటీ విద్యార్థులు వందలాది మంది ఉన్నారు. ప్రతి ఏడాది ప్రభుత్వం ‘బడిబాట’ పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నా, విద్యార్థులను పాఠశాలకు రప్పించడంలో ఉపాధ్యాయులు ఘోరంగా విఫలమవుతున్నారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను కాదని, భారమైనా ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
లక్షలాది రూపాయల ప్రజా ధనం జీతాల రూపంలో వెళ్తున్నా, ఫలితం మాత్రం శూన్యంగా మారుతోంది. కేవలం 20 మంది విద్యార్థుల కోసం ఆరుగురు హై-గ్రేడ్ ఉపాధ్యాయులు అవసరమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి, ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగకపోవడానికి గల కారణాలపై విచారణ చేపట్టాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని హుజూరాబాద్ ప్రజలు కోరుతున్నారు.
Also Read: Temple Lands: ఎండోమెంట్ శాఖలో చిత్ర విచిత్రం.. ప్రభుత్వం ఆదేశించిన స్పందించిన అధికారులు