Operation Kagar: స్వేచ్ఛ బ్యూరో: మరికొన్ని రోజుల్లో ఎర్ర జెండా రెపరెపలు కనిపించవా? దండకారణ్యంలో తుపాకుల గర్జనలు వినిపించవా? అంటే అవుననే చెబుతున్నాయి పోలీసు వర్గాలు. మావోయిస్టు రహిత దేశంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ కగార్ (సమాప్తం) సక్సెస్ కు అత్యంత చేరువలో ఉందని అంటున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా మనుగడ కొనసాగిస్తూ వచ్చిన మావోయిస్టు పార్టీ ప్రస్తుతం పతనం అంచుల్లో ఉందని చెబుతున్నాయి.
మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2024, జనవరి 1న ఆపరేషన్ కగార్ ను ప్రకటించింది. 2026, మార్చి 31వ తేదీలోపు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని విస్పష్టంగా ప్రకటించింది. అయితే, నిజానికి మావోయిస్టుల ఏరివేత 2019 నుంచే మొదలైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2019 నాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, బీహార్ మహారాష్ట్రతోపాటు మొత్తం పది రాష్ట్రాల్లో 61 జిల్లాలు, 245 పోలీస్ స్టేషన్ల పరిధుల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో ఉన్నాయి. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అదే సంవత్సరంలో ఫార్డర్డ్ ఆపరేటింగ్ బేస్ (ఎఫ్ఏబీ) క్యాంపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మొదటి సంవత్సరంలో సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలు వ్యూహాత్మక ప్రాంతాల్లో 24 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశాయి. ఆ తరువాత 2020లో 40, 2021లో 51, 2022లో 66 ఇలా ఆరేళ్లలో దాదాపు 400 బేస్ క్యాంపులను భద్రతా బలగాలు ఏర్పాటు చేసుకోగలిగాయి.
దీనిపై సీనియర్ పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడగా అడవుల్లో ప్రతీ 5 నుంచి 15 కిలోమీటర్లకు ఒకటి చొప్పున అత్యాధునిక ఆయుధాలు, వాహనాలు, ప్రత్యేక శిక్షణ పొందిన 200 నుంచి 400మంది భద్రతా బలగాలకు సౌకర్యంగా ఉండేలా ఈ బేస్ క్యాంపుల ఏర్పాటు జరిగినట్టు తెలిసింది. ఈ బేస్ క్యాంపుల ఆధారంగా ఆరేళ్లలో జరిపిన ఎన్ కౌంటర్లలో 12 వందల మందికి పైగా మావోయిస్టులు నేలకొరిగారు. దాదాపు ఎనిమిది వేల మంది మావోయిస్టులన భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఆరువేల మంది వరకు స్వచ్ఛంధంగా లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ ఉనికిని పూర్తిగా రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది. దీంట్లో భాగంగా గిరిజన, మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధిపై దృష్టి పెట్టింది. మెరుగైన శాంతిభద్రతలు, మౌళిక సదుపాయాలకు పెద్ద పీట వేసింది. రహదారుల నిర్మాణం, విద్య, వైద్యం, మంచినీటి వసతులు కల్పించటానికి కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసింది.
Also Read: Dharmapuri Arvind: కాంగ్రెస్ ప్రభుత్వం పై ఎంపీ ధర్మపురి అరవింద్ సెటైర్లు.. ఏమన్నారంటే..?
లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసం కల్పించటంతోపాటు పలు పథకాలను ప్రకటించింది. హింసలో మరణించిన సాధారణ పౌరుల కుటుంబాలు, భద్రతా సిబ్బంది కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాలు చెల్లించేందుకు మూడున్నర వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. ఇక, రాష్ట్ర గూఢచార విభాగాలు, మావోయిస్టు పార్టీ ప్రభావం ఉన్న ఆయా జిల్లాల పోలీసులు, పటిష్టమైన పోలీస్ స్టేషన్ల నిర్మాణం కోసం వాహపక్ష ప్రభావిత రాష్ట్రాలకు దాదాపు 18వేల కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇక, 2024, జనవరి 1న ఆపరేషన్ కగార్ ను మొదలు పెడుతున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని పూర్తిగా తుదముట్టించే దిశగా మరింత ముమ్మరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది.
ఇందులో భాగంగా వేలాది మంది భద్రతా బలగాలను అడవుల్లో దింపింది. వారి చేతికి డ్రోన్లు, హెలికాప్టర్ల వంటి అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అంద చేసింది. మార్చి 31వ తేదీలోపు మావోయిజాన్ని అంతం చేస్తామని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన టార్గెట్ కు చేరువలో ఉందని సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు పలువురు ఎన్ కౌంటర్లలో చనిపోవటం.. మరికొందరు లొంగిపోతుండటంతో క్యాడర్ అయోమయ పరిస్థితుల్లో ఉందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మిగిలిన కొద్దిమంది మావోయిస్టులు కూడా సరెండర్ అవుతారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.