Pawan Kalyan on Rangarajan Attack Case: చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై జరిగిన దాడిని యావత్ భారత్ ఖండిస్తోంది. ఇప్పటికే పార్టీలకు అతీతంగా దాడిని అందరూ ఖండిస్తూ ప్రకటనలు జారీ చేస్తుండగా, మరికొందరు నేరుగా రంగరాజన్ ను పరామర్శిస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాడి ఘటనపై స్పందించారు. పవన్ ఏమన్నారంటే..
చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారిపై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనైనట్లు పవన్ అన్నారు. దురదృష్టకరమైన ఘటనగా వర్ణించిన పవన, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా, ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్ ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారన్నారు. అలాగే తనదైన శైలిలో పోరాటం చేస్తున్నారన్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్ళిన ఒక మూక రంగరాజన్ పై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలని పవన్ డిమాండ్ చేశారు. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని కోరారు.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ తనకు అందించారన్నారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారని, ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. చిలుకూరు వెళ్ళి రంగరాజన్ ను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి పవన్ సూచించారు.
Also Read: Chilkuru Balaji Temple Rangarajan: రంగరాజన్ పైనే దాడి ఎందుకు? కారణం ఇదేనా?
కాగా తిరుపతి వారాహి సభ వేదికగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం యావత్ భారత్ నడుం బిగించాలని, ఎవరైనా అణగదొక్కాలని చూస్తే సహించేది లేదని పవన్ బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. అంతేకాదు సనాతన ధర్మ పరిరక్షణ కోసం 11 రోజులు ఉపవాస దీక్ష ఆచరించి, అలిపిరి నుండి కాలినడకన పవన్ తిరుమల శ్రీవారిని దర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తనకు ఎన్నో సలహాలు సూచనలను అర్చకులు రంగరాజన్ అందించినట్లు పవన్ పేర్కొన్నారు. అటువంటి ధర్మ పరిరక్షకుల మీద జరిగిన దాడికి పాల్పడిన వారిని చట్టరీత్యా శిక్షించాలని పవన్ అన్నారు. మొత్తం మీద సంఘాలు, రాజకీయ పార్టీలు, నాయకులు దాడిని ఖండిస్తూ రంగరాజన్ కు అండగా నిలవడం శుభపరిణామమని భక్తులు తెలుపుతున్నారు.