Phone Tapping Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దూకుడు పెంచింది. కేసు దర్యాప్తును వేగవంతం చేసే దిశగా ఆదివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ అధికారులతో సీపీ సజ్జనార్ కీలక సమావేశం నిర్వహించారు. కొత్తగా ఏర్పాటైన సిట్ బృందంతో జరిగిన ఈ తొలి భేటీలో కేసు పురోగతిపై సమీక్షించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారించాలని సిట్ నిర్ణయించింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున, దర్యాప్తు అత్యంత పారదర్శకంగా, కోర్టుకు జవాబుదారీగా ఉండాలని సజ్జనార్ అధికారులను ఆదేశించారు. కేసు దర్యాప్తు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, వీలైనంత త్వరగా పూర్తిస్థాయి చార్జ్షీట్ (Charge Sheet) దాఖలు చేయడానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితుడైన మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావును సిట్ బృందం గత 10 రోజులుగా కస్టోడియల్ విచారణ చేస్తోంది. ఈ విచారణలో ట్యాపింగ్ నెట్వర్క్, ఆపరేషన్లకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ప్రభాకర్రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా ముందుగా చార్జ్షీట్ వేయాలని, ఆ తర్వాత ఈ కేసుతో లింక్ ఉన్న రాజకీయ నాయకులు, ఇతర ఉన్నతాధికారులను విచారించాలని సిట్ వ్యూహం రచిస్తోంది. చార్జ్షీట్ దాఖలైన వెంటనే రాజకీయ ప్రముఖులకు నోటీసులు వెళ్లే అవకాశం ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.