Christmas – Sankranti : తెలుగు రాష్ట్రాల్లో వరుస పండుగలు వచ్చేశాయి. ఈ నెల చివర్లో క్రిస్మస్ పలకరిస్తుండగా, వచ్చే నెలలోనే సంక్రాంతి సందడి చేయనుంది. దీంతో.. ఇప్పటి నుంచే సొంతూర్లకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.. చాలా మంది. పిల్లలకు సెలవులు, పెద్దలకు హాలిడేస్ ఉంటుండడంతో ఎంచక్కా సొంతూర్లల్లో గడేపేద్దామనుకుంటున్నారు. అయితే.. మీకు ఇది హాలిడే, కానీ దొంగలకు ఇదే వర్కింగ్ డేస్ అంటున్నారు పోలీసులు.
సరదాగా పండుగను ఎంజాయ్ చేద్దాం అనుకుని ఏమరపాటుగా ఉంటే ఇబ్బందులు తప్పవంటున్నారు పోలీసులు. సిటీలోని ఇళ్లను నిర్లక్ష్యంగా వదిలి వెల్లవద్దని, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే.. దొంగలకు మీ ఇల్లు లక్ష్యంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. సంక్రాంతి, క్రిస్మస్ కోసం ఇళ్లను వదిలి వెళ్లే వాళ్లు ఈ కింది జాగ్రత్తలు పాటించాలి అంటూ.. పోలీసులు కొన్ని సూచనలు చేశారు. అవేంటంటే..
పండగలు, శుభకార్యాలు ఎక్కువగా ఉండే రోజుల్లోనే దొంగలు ఎక్కువగా నేరాలకు పాల్పడుతుంటారు. ఈ రోజుల్లో పగలు వీధుల్లో రెక్కీ నిర్వహించుకుని, రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతుంటారు. ఈ విషయాన్నే వెల్లడిస్తున్న పోలీసులు.. చోరీ జరిగాక పోలీసులకు ఫిర్యాదు చేయడం కంటే ముందే జాగ్రత్తగా ఉండడం మేలని సూచిస్తున్నారు.
పోలీసుల చెబుతున్న జాగ్రత్తలు..
సాధ్యమైనంత వరకు ఇళ్లను వదిలి వెళ్లవద్దంటున్న పోలీసులు.. అత్యవసరమైతే చుట్టుపక్కల వాళ్లకు, సమీప బంధువులకు తెలియజేసి వెళ్లాలంటున్నారు. వీలైతే.. ఎవరినైనా ఇంటి దగ్గర పడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఇంటికి, ఇంటి గేటుకు తాళం వేసి వెళ్లవద్దంటున్నారు. అలా చేస్తే.. ఇంట్లో ఎవరూ లేరని స్పష్టంగా తెలిపోతుందంటున్నారు. అందుకే.. రోడ్డు వైపు కనిపించేలా కాకుండా.. పక్క వైపునున్న తలుపులకు తాళం వేసుకోవాలని, వేసిన తాళం కనిపించకుండా.. కర్టెన్ కప్పేయాలని చెబుతున్నారు.
రోజుల తరబడి ఇళ్లకు దూరంగా ఉండాల్సి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ విలువైన వస్తువులైన బంగారు, వెండి ఆభరణాలను, నగదును ఇంట్లో ఉంచవద్దంటున్నారు. సురక్షితంగా ఉంచుకునేందుకు.. బ్యాంకు లాకర్లను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. ఇంట్లో లైట్లను అన్నింటినీ ఆపేయవద్దని చెబుతున్న పోలీసులు.. రాత్రిళ్లు ఇంట్లో వెలుతురు ఉండేటట్లు ఏదైనా గదిలో లైట్ వేసి ఉంచాలి సూచించారు.
పండుగలకు ఊరు వెళ్లే వాళ్లు ఇంటి పక్కన వారికి తెలిపాలని, వారిని ఓ కంట కనిపెట్టేలా చూసుకోవాలని చెప్పాలన్నారు. అదే తీరుగా.. పోలీసు స్టేషన్ కి సమాచారం అందిస్తే.. రాత్రిళ్లు గస్తీ తిరిగే సిబ్బంది ప్రత్యేకంగా నిఘా ఉంచుతారని తెలిపారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించిన పోలీసుల.. రాత్రిళ్లు ఎవరైనా వ్యక్తులు వస్తే సమాచారం అందించే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేవలం గేటు, తలుపు మాత్రమే కాకుండా.. ఇంటి బయటకు నాలుగు దిక్కులా రోడ్డు సీసీ టీవీల్లో పడేలా కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఎవరైనా కొత్త వ్యక్తులు, అనుమానితులు ఇంటి చుట్టుపక్కల, కాలనీలో సంచరిస్తే.. వెంటనే డయల్ 100 కి గాని, సమీపంలోని పోలీస్ స్టేషన్కు గాని సమాచారం అందించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ఈ సూచనల్ని పాటించాలని కోరిన పోలీసులు.. నేరం జరిగిన తర్వాత కంటే జరగక ముందే అప్రమత్తంగా వ్యవహరించడం మంచిదంటున్నారు. ఇవీ పోలీసుల సూచనలు.. మీలో ఎవరైనా ఈ సెలవులకు దూర ప్రాంతాలకు వెళ్లాలి అనుకుంటే.. ఈ సూచనల్ని కచ్చితంగా ఫాలో అవ్వండి.