Rural Roads: స్వేచ్ఛ బ్యూరో: నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల పరిస్థితి రోజురోజుకు మరింత దయనీయంగా మారుతోంది. గతంలో ఎంపీగా ఉన్న వ్యక్తి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎంపీగా మారినా ప్రజల ప్రాధమిక సమస్యలలో ఒకటైన రోడ్ల సమస్య మాత్రం ఎక్కడా పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు… ఎంపీ ఎమ్మెల్యే అయ్యాడు కానీ మా కంకర రోడ్డు మాత్రం డాంబర్ రోడ్డు కాలేదు” అంటూ ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
దౌల్తాబాద్ మండల పరిధిలోని గ్రామాల్లో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మొండిచింత–బేగంపేట్, రామారం–గొల్లపల్లి, ఇందుప్రియాల్–మహమ్మద్ షాపూర్, గొడుగుపల్లి–మక్కరాజిపేట్ వంటి కీలక రహదారులు గుంతలతో నిండిపోయి ప్రయాణానికి ప్రమాదకరంగా మారాయి. విద్యార్థులు ప్రతిరోజూ చదువుల కోసం గజ్వేల్కు వెళ్లాల్సి వస్తుండగా, ఈ రహదారుల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: మేడ్చల్ పెద్ద చెరువుకి కన్నం.. తూములు తెరిచి నీరు వృథా ..!
వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, ప్రయాణం చేయడమే కష్టంగా మారుతోందని వారు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పరిస్థితి మరింత విషమంగా మారుతోంది. ఒకవేళ ఎవరికైనా ఆరోగ్యం బాగోలేక 108 అంబులెన్స్కు ఫోన్ చేసినా, రహదారుల దుస్థితి కారణంగా సమయానికి చేరుకోలేకపోతున్నదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని వారు అంటున్నారు.
రోడ్డు బాగుంటేనే ప్రాణం బాగుంటుంది. కానీ మా పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అవుతున్నాయన్న ప్రచారం ఉన్నా, పనులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టి ప్రజల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read: ఆంధ్రా మద్యం తెలంగాణలోకి ఎలా వచ్చింది: శ్రీనివాస్ గౌడ్