Dumpyard Issue: స్వేచ్ఛ బ్యూరో: జవహార్నగర్ డంపింగ్యార్డ్ వ్యవహారంపై ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. “రాంకీ చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది మరొకటి. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు” అని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి హెచ్చరించారు. గురువారం నాగోల్లోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో నిర్వహించిన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో ఎంపీ ఈటెల రాజేందర్, కమిషనర్ వినయ్కృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి, రాజశేఖర్రెడ్డి, సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జవహార్నగర్ డంపింగ్యార్డ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, సామాజిక కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాంకీ సంస్థకు ప్రతి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ ఒప్పందం ప్రకారం స్థానిక ప్రజలకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు అందించడం లేదని ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జవహార్నగర్ పరిసర ప్రాంతాల్లో దుర్వాసన తీవ్రంగా వ్యాపించి ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also read: కరెంట్ బిల్లు రాదు.. ఏసీ అక్కర్లేదు.. ఈ 6 ట్రిక్స్తో మీ గది ‘కాశ్మీర్’ అయిపోద్ది!
భూగర్భజలాలు పూర్తిగా కలుషితమై ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని పేర్కొన్నారు.“ప్రజలకు ఇచ్చిన హామీలను రాంకీ నిలబెట్టుకోలేదు. ఇక్కడి నిధులను ఇతర రాష్ట్రాల్లో ఖర్చు పెడుతోంది” అంటూ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. సమావేశానికి హాజరైన రాంకీ సంస్థ ప్రతినిధులను నిలదీశారు. కొందరు ప్రజాప్రతినిధులు రాంకీ సంస్థను పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్నం మహేందర్రెడ్డి మాట్లాడుతూ జవహార్నగర్ సమస్యను ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు అఖిలపక్షంగా చర్చించి తదుపరి చర్యలపై నివేదిక అందిస్తామని చెప్పారు. “దేవేందర్గౌడ్ మంత్రి కాలం నుంచే ఈ సమస్యను చూస్తున్నా.. ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలి” అని అన్నారు.
అనంతరం ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ జవహార్నగర్ డంపింగ్యార్డ్ సమస్య నుంచి ప్రజలను కాపాడేందుకు క్షేత్రస్థాయిలో అఖిలపక్ష పర్యటన చేపడతామని తెలిపారు. మల్కాజిగిరి కార్పొరేషన్లో నిధుల కొరతతో కొన్ని శాఖలు సక్రమంగా పనిచేయడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.వచ్చే వర్షాకాలంలో వరద ముప్పు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు తమ పూర్తి సహకారం ఉంటుందని ప్రజాప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మున్సిపల్ చైర్మన్ లు,ప్రజాపత్రినిధులు పాల్గొన్నారు.
Also read: కరెంటు లైన్ల పేరుతో భారీగా చెట్లు నరికివేత.. అధికారుల తీరుపై జనం ఫైర్!