SLBC Tunnel Mishap: శనివారం ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా.. దోమలపెంట దగ్గరలోని.. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో ఘోర ప్రమాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. జరిగిన ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో వివరించారు. సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు తగిన సహాయక చర్యలు చేపడుతున్నారని సీఎం రాహుల్ గాంధీకి తెలిపారు.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని రాహుల్ గాంధీకి వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలతో పాటు ,ఆ కుటుంబాలను ఆదుకోవాలని సీఎంకు రాహుల్ గాంధీ సూచించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను రాహుల్ గాంధీ అభినందించారు.
కాగా సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో మరింత వేగంపెంచాలని సీఎం సూచించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించాలన్నారు. సహాయక చర్యలు చేపట్టే విషయంలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
SLBC టన్నెల్లో చిక్కకున్న 8 మందిని తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు టన్నెల్లో 13.6 కిలోమీటర్ల వద్ద పనులు నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఎగ్జాక్ట్గా ప్రమాదం జరిగిన ప్రాంతంలో కార్మికులు ఉన్నారా? మట్టి కుప్పులు కార్మికులపై కూలాయా? లేక వారు తిరిగి వచ్చేమార్గంలో కూలాయా? అనేది ఇంకా తెలియలేదు.
డీ వాటరింగ్ చేసేందుకు సహాయక బృందాలు టన్నెల్ లోపలికి వెళ్లాయి. 12 కిలోమీటర్ల తర్వాత బురద నీరు ఉండడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెనక్కి వచ్చేశాయి. ఆ బురద వాటర్ను మాన్యువల్గా తొలగించాల్సిందేనని చెబుతున్నాయి. దీంతో కరెంటు పునరుద్ధరణ ఆక్సీజన్ పైపుల ఏర్పాటు, నీటి తొలగింపునకు చర్యలు చేపట్టారు ఇంజనీర్లు. షిఫ్ట్లు వారీగా పనిచేస్తున్నారు. రక్షణ చర్యలపై అధికారులు సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ మానటరింగ్ చేస్తున్నారు. మంత్రి ఉత్తమ్ ఘటనాస్థలానికి చేరుకున్నారు.
Also Read: హైదరాబాద్ మెట్రో కారిడార్-4, ఆ ప్రాంతాల మీదుగా
ఈ ఘటనపై ప్రధాని మోడీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన విషయం తెలిసిందే. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థలానికి మంత్రులు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారని సీఎం రేవంత్ ప్రధాని మోడీకి వివరించారు. సహాయక చర్యల కోసం వెంటనే రాష్ట్రానికి NDRF టీంను పంపిస్తామని ప్రధానమంత్రి సీఎం కు చెప్పారు.
ప్రధాన మంత్రి ద్వారా.. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలను తీసుకుంటూ.. భారత సైన్యాన్ని సైతం రంగంలోకి దించి.. సీఎం సలహా సూచనలతో ప్రత్యక్షంగా మంత్రులే.. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఆ ఎనిమిది మంది సురక్షితంగా బయట పడాలని ప్రాజెక్టు లో పని చేసేవారితో సహా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.