Rajya Sabha Elections: స్వేచ్ఛ బ్యూరో: ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తారా? లేదా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరో ఇద్దరిపై గురువారం తుది తీర్పును ప్రకటించనున్నారు. అయితే వీరి ఓటు ఎటుదనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ విస్తృత చర్చజరుగుతుంది.
సరైన ఆధారాలు లేవు..?
రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓట్లు కీలకంగా మారాయి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపితే.. కాంగ్రెస్ పార్టీ పోటీలో ఇద్దరు అభ్యర్థులను బరిలో నిలిపితే ఈ 10మంది ఎమ్మెల్యేల ఓట్లు గెలుపును నిర్దేశిస్తాయి. అయితే వీరు ఎవరికి ఓటు వేస్తారనేది చర్చకు దారితీసింది. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), పోచారం శ్రీనివాస్రెడ్డి (బాన్సువాడ), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), కాలె యాదయ్య (చేవేళ్ల), బండ్ల క్రిష్ణమోహన్రెడ్డి (గద్వాల్), గూడెం మహిపాల్రెడ్డి (పటాన్చెరు), ఎం.సంజయ్ కుమార్(జగిత్యాల), ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) లపై విచారణ చేపట్టిన స్పీకర్.. పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేవని, వారు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారేనని ఈ 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. అదే విధంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్) సైతం స్పీకర్ విచారణ చేపట్టారు. పిటిషన్ దారుల నుంచి సైతం వాదనలు విని, వారి నుంచి వివరాలను సేకరించారు. అయితే తుది తీర్పును సైతం పెండింగ్ లో పెట్టారు. గురువారం ప్రకటించనున్నారు. వీరిద్దరికి సైతం క్లీన్ చిట్ ఇస్తారనే ప్రచారం జరుగుతుంది. దీంతో పిరాయింపులు ఎదుర్కొంటున్న 10మంది బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యేనని స్పష్టం కానున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని బరిలో నిలిపి పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తే ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారనేది ఇప్పుడు హాట్ టాఫిక్ అయింది. వీరు బీఆర్ఎస్ కు ఓటు వేస్తారా? లేక కాంగ్రెస్ కు ఓటు వేస్తారా? లేకుంటే ఓటింగ్ కు దూరంగా ఉంటారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. ఒక వేళ కాంగ్రెస్ కు ఓటువేస్తే బీఆర్ఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది. మళ్లీ కోర్టుమెట్లు ఎక్కుతుందా? లేక సైలెంట్ అవుతుందా? అనేది సైతం గులాబీలోనే చర్చమొదలైంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే ఎంఐఎం మద్దతుగానీ, బీజేపీ మద్దతుగానీ తీసుకుంటుందా? అనేది కూడా చర్చజరుగుతుంది. ఇప్పటివరకు పార్టీ అధిష్టానం క్లారిటీఇవ్వకపోవడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం సైతం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రాజ్యసభ ఎన్నికలు మాత్రం ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది.
Also Read: Gadwal District: గద్వాల జిల్లా తహసిల్దార్ కార్యాలయాల్లో రాజ్యమేలుతున్న అవినీతి..!