BRS Party: మున్సిపాలిటీల్లో గులాబీ పార్టీలో అసంతృప్తి బయటపడుతుంది. టికెట్లు రాని నేతలు రోడ్డుకెక్కి నిరసనలు తెలుపుతున్నారు. పలువురు మాత్రం సైలెంట్ గా ఉంటూ పార్టీ ఓటమికి వ్యూహాలు రచిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కొన్ని మున్సిపాలిటీల్లో పార్టీ రెబల్స్ పోటీలో ఉండటంతో ఇన్ చార్జులకు తలనొప్పిగా మారింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. 123 మున్సిపల్, పురపాలక సంఘాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇందులో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా గులాబీ పావులు కదుపుతున్నప్పటికీ రెబల్స్ బెడద పార్టీని వెంటాడుతుంది. పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి టికెట్లు ఇవ్వలేదని పలువురు బాహాటంగా పేర్కొంటున్నారు. అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు.
Also Read: Nitin Nabin: నేడు తెలంగాణకు నితిన్ నబీన్.. పాలమూరు సభతో కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్!
పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో జిల్లా ఇన్ చార్జులు, నియోజకవర్గ ఇన్ చార్జుల మధ్య విభేదాలు ఉండటంతో పార్టీ ఇచ్చే బీఫారాలలో తమవర్గానికి ఇవ్వడం లేదని ఒకరిపై ఒకరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రేగాకాంతారావు, ఇన్ చార్జీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మధ్య టికెట్ల పంచాయతీ నడుస్తుంది. ఏకపక్షంగా టికెట్లు కేటాయించారని , తను ప్రకటించినవారికి కాకుండా ఇతరులకు ఇచ్చారని కాంతారావు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇలా ఉమ్మడి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో టికెట్ల విషయంపై నేతల మధ్య విభేదాలు ఉన్నాయి.
టికెట్లు ఇవ్వలేదని పార్టీలో పనిచేసే సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కరీంనగర్ మున్సిపాలిటీల్లో రెండో డివిజన్ నుంచి దాసరి సాగర్, మూడో డివిజన్ నుంచి ప్రభాకర్ టికెట్లు ఆశించారు. కానీ మాజీ మంత్రి గంగుల కమలాకర్ తమకు టికెట్లు ఇవ్వకుండా మోసం చేశాడని ఆయన ఇంటిఎదుట ఆందోళన చేశారు. ప్రచారకరపత్రాలను, పోస్టర్లను చించి నిప్పంటించారు. అంతేగాకుండా గంగుల ఇంట్లోకి కరప్రతాలను విసిరారు. ఇలా పలు మున్సిపాలిటీల్లో టికెట్లు రాని నేతలు తీవ్రఅసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అయితే వారు పోలింగ్ రోజూ సహకరిస్తారా? లేదా? అనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు చెప్పినవారికే టికెట్లు ఇవ్వడం, ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో రెండు వర్గాలు కొనసాగుతుండటంతో ఈ నేపథ్యంలో ఎలా విజయం సాధిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పార్టీ సర్వేలతో టికెట్లు ఇచ్చామని చెబుతున్నప్పటికీ పార్టీ కేడర్ లో మాత్రం ఆదరణ లేనివారికే పెద్దపీట వేశారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవారం రోజులు మాత్రం పోలింగ్ కు గడువు ఉండటంతో పార్టీని ఎలా విజయతీరాలను నడిపిస్తారు? మున్సిపాలిటీలపై ఎలా పాగా వేస్తారనేది చర్చనీయాంశమైంది.
Also Read:Mamata Banerjee: న్యాయపోరాటానికి సిద్ధమైన అగ్నికన్య.. లాయర్ కోటు ధరించి మమత ఏం చేయబోతున్నారు?