Regeneron GCC: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ లో కొత్తగా మరో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు కానుంది. రీజెనరాన్ సంస్థ దీని ఏర్పాటుకు తెలంగాణను ఎంపిక చేసుకుంది. మంగళవారం హైదరాబాద్ లో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఆ సంస్థకు చెందిన ప్రతినిధులు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సమక్షంలో జీసీసీ ఏర్పాటుకు సంబంధించి బ్యారీ కోవల్. తెలంగాణా లైఫ్ సైన్సెస్ సిఈఓ సర్వేశ్ సింగ్ లు అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జీసీసీల రాకతో ఐటీ ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.
న్యూయార్క్ లోని ట్యారిటౌన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ దిగ్గజం రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీ ఏర్పాటుకు రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవడం మన ప్రతిష్ఠను మరింత పెంచుతుందని చెప్పారు. రీజెనరాన్ కు ఐర్లాండ్, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కార్యాలయాలు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నా హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న జీసీసీ ప్రత్యేకమైన గ్లోబల్ హబ్గా పనిచేస్తుందని తెలిపారు.. ఇది ప్రపంచవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, అధునాతన డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీరింగ్, కమర్షియల్ అనలిటిక్స్ వంటి అత్యున్నత స్థాయి డిజిటల్ సేవలను అందిస్తుందని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపు 450 గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు పనిచేస్తుండగా, మరిన్ని అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని తెలిపారు.
Also Read: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. అమెరికా ఇరాన్ లొల్లితో భారత్కు కొత్త తిప్పలు!
జీసీసీల కేంద్రంగా ముంబయి, ఢిల్లీ, చెన్నైలను అధిగమించి హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందన చెప్పారు. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డిజిటల్ టెక్నాలజీల రంగాల్లో ఉన్న బలమైన ఎకోసిస్టం ప్రపంచ కంపెనీలను ఆకర్షిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశోధన, తయారీ రంగం, పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జీనోమ్ వ్యాలీ విస్తరణ, త్వరలో ఏర్పాటు కానున్న గ్రీన్ ఫార్మా సిటీ వంటివి రాష్ట్ర లైఫ్ సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయని చెప్పారు.
రీజెనరాన్ సంస్థ ఏర్పాటు చేయనున్న గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ ద్వారా రాబోయే సంవత్సరాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రముఖ బయోటెక్నాలజీ సంస్థల్లో ఒకటైన రీజెనెరాన్ ఇప్పటికే అనేక ఔషధాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రీజెనెరాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యారి కోవాల్, జీసీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ ఓనాట్, సంస్థ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Also Reasd: సిద్దిపేటలో 74 ఎకరాల భూ కుంభకోణం.. లీజు పేరుతో రాత్రికి రాత్రే పట్టాలు..!