Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు అద్దంపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి, రెండు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీఆర్ఎస్, బీజేపీలకు అనుకూలంగా ఉంటాయని భావించిన జిల్లాల్లో సైతం కాంగ్రెస్ సత్తాచాటింది. ఆదిలాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన మెజారిటీ అభ్యర్థులు గెలుపొందారు.
గత రెండేళ్ల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా.. దాన్నో స్కాంగా బీఆర్ఎస్ చిత్రీకరిస్తూ వచ్చింది. సమ్మిట్ నిర్వహించినా, అంతర్జాతీయ ఈవెంట్లు చేపట్టినా సీఎం రేవంత్పై స్కాం ముద్ర వేస్తూ బీఆర్ఎస్ రాజకీయం చేసింది. ఇక బీఆర్ఎస్ చేసే విమర్శలకు వంతపాడుతూ బీజేపీ కూడా రేవంత్ రెడ్డిపై అదే స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చింది. అయితే, పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు చెప్పిన తెలంగాణ పల్లె ప్రజలు.. బీఆర్ఎస్, బీజేపీల రాజకీయాల్ని తిప్పికొట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు విపక్ష పార్టీలు చేసిన, చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ప్రజలు జైకొట్టారనే చర్చ నడుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి పనితీరు సగటు కాంగ్రెస్ కార్యకర్తల్లో కాన్ఫిడెన్స్ నింపినట్టు పల్లె తీర్పు స్పష్టం చేస్తోంది. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్ ప్రదర్శించిన రాజకీయ పరిపక్వత, పాలనా దక్షత ఆయనకు పార్టీలో తిరుగులేని ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. సన్నబియ్యం, ఉచిత బస్సు, విద్యుత్, సబ్సిడీ గ్యాస్, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు, ఉద్యోగాల భర్తీ వంటి చర్యలు కామన్ మ్యాన్ సెంట్రిక్గా అమలు చేస్తుండడం రేవంత్పై ప్రజల్లో సానుకూలతకు కారణమైంది.
ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను విజయతీరాలకు చేర్చడం పార్టీ క్యాడర్కు బూస్ట్ ఇచ్చినట్టైంది. 108 దేశాలు పాల్గొన్న మిస్ వరల్డ్ ఈవెంట్, రూ.5.7 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’, ఆతిథ్యంలో లియోనిల్ మెస్సీని మైమరపించిన హైదరాబాద్ టూర్ వంటి అంతర్జాతీయ ఈవెంట్లను ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా పూర్తిచేసిన సీఎం రేవంత్ అడ్మినిస్ట్రేషన్పై దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. సిటిజన్స్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆయన ప్రభుత్వాన్ని నడుపుతున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. యువతకు ఉపాధి కల్పన, ముఖ్యంగా యంగ్ ఇండియాకు రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యం, హైదరాబాద్ నగరాభివృద్ధి-విస్తరణకు చేస్తున్న కృషి, జీహెచ్ఎంసీ పరిధి పెంపు వంటి చర్యలు నగరాభివృద్ధిలో సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాలు అన్నీ కూడా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో రేవంత్ రెడ్డికి ఫుల్ మార్కులు తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా అధిష్టానం ముందు రేవంత్ ఇమేజ్ను అమాంతం పెంచాయి. ప్రత్యామ్నాయం అనే మాటే వినబడకుండా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడుపుతున్న తీరుపై అధిష్టానం ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పూర్తి విశ్వాసం ఉంచినట్టు తెలిసింది. అందుకే మెస్సీ మ్యాచ్కు రావాలని రేవంత్ రెడ్డి కోరగానే రాహుల్ గాంధీ అంగీకరించి వచ్చారనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 60% సర్పంచ్ స్థానాలను గెలుచుకొని సత్తా చూపిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో తిరిగి పూర్వవైభవాన్ని సొంతం చేసుకుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.