KTR: తెలంగాణలో కాంగ్రెస్ పని ఇక అయిపోయినట్లే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇదే అంశం కాంగ్రెస్ చేయించుకున్న సొంత సర్వేలోనే తేలిందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేకతగా స్పష్టంగా వెల్లడైందని పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ సుమారు 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో స్పష్టంగా తేలిందన్నారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గురువారం జీహెచ్ఎంసీ పరిధిలోని గ్రేటర్ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలతో కేటీఆర్ భేటి అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరోసారి ప్రజలు కేసీఆర్ ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని చెప్పారు. పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే కాంగ్రెస్ నేతలు గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. అటెన్షన్ డైవర్షన్ లో భాగంగా కాలేశ్వరం నుంచి మొదలుకొని రైతుబంధు వరకు అన్నింటిపైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని కేసీఆర్ అన్నారు. సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నారు. ఇచ్చిన గ్యారంటీల అమలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైనందువల్లనే ప్రజలు.. కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై నమ్మకం కోల్పోయారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపి లాంటి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వడానికి ప్రజలు ఏమాత్రం సిద్ధంగా లేరని కేటీఆర్ అన్నారు.
Also Read: హైదరాబాద్లో భారీ ఆపరేషన్.. 1100 మంది పోలీసులతో.. ఇళ్లల్లో సోదాలు!
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సర్ కార్యక్రమం మందకొడిగా సాగుతున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్లకు సరైన శిక్షణ, తగిన ఏర్పాట్లు చేయలేదన్నారు. ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫీడ్బ్యాక్ వస్తోందన్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమం అత్యంత కీలకమైన అంశమని.. ‘ఒక వ్యక్తికి ఒకే ఓటు’ ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా దొంగ ఓట్లు లేకుండా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేలా చూడాలని, ఏ ఒక్కరి ఓటు అన్యాయంగా తొలగించబడకుండా చూడాలన్నారు.