Warangal News: వర్ధన్నపేట మండలంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యల పేరుతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానిక ప్రజలు, ట్రాక్టర్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడం అవసరమేనన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, అమాయకులపై అనుమానాల ముసుగులో చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తున్న కాలి ట్రాక్టర్లను సైతం నిలిపివేసి ఇసుక రవాణాగా భావిస్తూ స్టేషన్కు తరలిస్తున్న ఘటనలు వరుసగా జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కత్రియాల గ్రామానికి చెందిన ఓ డ్రైవర్ తన బంధువు పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు,అయితే వారికి వివరణ ఇచ్చినా వినిపించుకోకుండా దురుసుగా ప్రవర్తించి ట్రాక్టర్ను స్టేషన్కు తరలించినట్లు సమాచారం.
ఇదే తరహాలో ల్యాబర్తి గ్రామ శివారులో ఆకేరు వాగు సమీపంలోనూ ట్రాక్టర్లను ఆపి విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేసిన ఘటనలు జరిగినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పట్టుబడిన వాహనాలపై చట్టపరంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి కోర్టు ముందు ఉంచాల్సిన ప్రక్రియను అనుసరించకుండా, రోజుల తరబడి స్టేషన్ల వద్ద నిలిపివేయడం వెనుక ఉద్దేశ్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారిక కేసులు నమోదు కాకపోవడం, అక్కడికక్కడే సమస్యలు ‘సెటిల్’ అవుతున్నాయన్న ప్రచారం కార్మికుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Jadcherla: దారుణం.. మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న కుక్క.. నిద్రపోతున్న జడ్చర్ల ఆసుపత్రి యంత్రాంగం!
గతంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్పై దాడి జరిగిన ఘటనపై వివాదం చల్లారకముందే మళ్లీ ఇలాంటి ఆరోపణలు రావడం పోలీసుల పనితీరుపై ప్రజల్లో అనిశ్చితిని పెంచుతోంది. అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయాలన్న లక్ష్యంతో చేపడుతున్న చర్యలు పారదర్శకంగా ఉండాలని, నిర్దోషులు ఇబ్బందులు పడకుండా స్పష్టమైన విధానాలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన చోట అనుమానాలకు తావిచ్చే విధంగా వ్యవహరిస్తే పోలీసు వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మండలంలోని కత్రియాల గ్రామానికి చెందిన ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్న విషయం నిజమేనని వర్ధన్నపేట ఎస్ఐ తెలిపారు. అయితే ట్రాక్టర్లో ఉన్న ఇసుకను తన కళ్ళముందే ఖాళీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ట్రాక్టర్ను నిలిపివేసిన వెంటనే సంబంధిత అంశంపై ఎమ్మార్వోకు సమాచారం అందించినట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో ఎలాంటి రాజీ ప్రయత్నాలు జరగలేదని, ఎవరి వద్ద నుంచీ డబ్బులు తీసుకోలేదని,మా మీద వస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు సమాచారం అని ఖండించారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తేలితే తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి వెనుకాడబోమని ఎస్ఐ పేర్కొన్నారు. అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.
Also Read: Shahid Afridi: అల్లుడు కాదు వాడు నరరూప రాక్షసుడు..బౌలింగ్ వేయడం రాని దద్దమ్మ