భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రియదర్శిని డిగ్రీ పీజీ కళాశాల డైరెక్టర్ చలపతిరావు కారు ఢీకొనడంతో రామాంజనేయ కాలనీకి చెందిన సంఘమయ్య (55) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. సంఘమయ్య రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో సంఘమయ్యకు తలకు, శరీరానికి తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితికి చేరాడు.
ప్రమాదం అనంతరం చలపతిరావు స్వయంగా సంఘమయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ.. వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చలపతిరావు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే తమ తండ్రి మృతి చెందాడని ఆరోపిస్తూ.. వెంటనే ఆయన్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మృతదేహాన్ని ప్రియదర్శిని కళాశాల ఎదుట ఉంచి కుటుంబసభ్యులు, స్థానికులు ధర్నాకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మృతుడి కూతురు కన్నీటితో విజ్ఞప్తి చేసింది. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.
ALSO READ: Film Shooting Ban: కోఠి ఉమెన్స్ యూనివర్సిటిలో సినిమా షూటింగులపై నిషేదం.. ఒకరిపై సస్పెన్షన్ వేటు