CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించారు. ఈ పర్యటనలో రూ. 103 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తానని కొడంగల్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఢిల్లీ నోయిడా నగర తరహాలో తెలంగాణ కొడంగల్ అభివృద్ధి చెందుతుందని ఆయన ప్రకటించారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
పర్యటనలో భాగంగా హరేకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మధ్యాహ్న భోజన కిచెన్ షెడ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కొడంగల్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టబోయే రూ. 103 కోట్ల పనులను ప్రారంభించినట్లు తెలిపారు.
కొడంగల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లగచర్లలో కుట్రలు పన్ని భూసేకరణ ప్రక్రియను అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలపై ముఖ్యమంత్రి మండిపడ్డారు. రైతులు అన్యాయంగా కేసుల్లో ఇరుక్కునేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల వైఖరి వల్ల కొడంగల్ అభివృద్ధి ఆగిపోయిందని ఆయన అన్నారు.
త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని తనకు సమాచారం అందిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే అభ్యర్థులను యువకులను సర్పంచ్లుగా ఎన్నుకోవాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకునే వారికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వొద్దని ఎన్నికల్లో గెలిపించొద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారానే కొడంగల్ ప్రగతి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ జిల్లా ఎస్పీ స్నేహ మెహర పర్యవేక్షించారు. సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కొడంగల్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.
ALSO READ: MLA Kadiyam Srihari: రాజీనామాపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు