Secunderabad: స్వేచ్ఛ బ్యూరో: డిమాండ్ ను అవకాశంగా చేసుకుని కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న ముఠాను సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు గాంధీనగర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 7.50 లక్షల రూపాయల విలువ చేసే సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. కర్మన్ ఘాట్ ప్రాంత నివాసి యాలం ప్రతాప్ కుమార్ (21), మీర్ పేటకు చెందిన జల్లెల మల్లేశ్ (25) వృత్తిరీత్యా గ్యాస్ డెలివరి బాయ్ లు. సికింద్రాబాద్ పాస్ పోర్ట్ ఆఫీస్ ప్రాంత నివాసి, వృత్తిరీత్యా డ్రైవర్ అయిన మోరా నాగార్జున (32) వీరి స్నేహితుడు. ఇక, సికింద్రాబాద్ న్యూ బోయిగూడలో ఉంటూ టిఫిన్ సెంటర్ నడుపుతున్న నాగులపల్లి మల్లేశ్ (56)తో వీరికి పరిచయం ఉంది. ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు కొరత ఉన్న నేపథ్యంలో సొమ్ము చేసుకోవాలని ప్రతాప్ కుమార్, మల్లేశ్ కలిసి పథకం వేశారు.
దాని ప్రకారం తాము పని చేస్తున్న భార్గవి గ్యాస్ ఏజన్సీ యజమానికి తెలియకుండా గోడౌన్ నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కొన్నింటిని బయటకు తరలించటం మొదలు పెట్టారు. 3,337 రూపాయల ధర ఉన్న ఒక్కో సిలిండర్ ను 3,500 నుంచి 3,800లకు నాగార్జునకు విక్రయిస్తున్నారు. నాగార్జున వేర్వేరు ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లకు ఒక్కో సిలిండర్ ను 5వేల రూపాయలకు అమ్ముతూ వస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందటంతో టాస్క్ ఫోర్స్ సీఐలు రాజశేఖర్, రాఘవేందర్, గాంధీనగర్ సీఐ బోస్ కిరణ్, ఎస్ఐ కరుణాకర్ రెడ్డితోపాటు సిబ్బందితో కలిసి వీరిపై నిఘా పెట్టారు.
చివరకు న్యూబోయిగూడ ఐడీహెచ్ కాలనీలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి గ్యాస్ తో ఉన్న 29 సిలిండర్లతో పాటు ఖాళీగా ఉన్న మరో 104 సిలిండర్లను సీజ్ చేశారు. వీటిని తరలించటానికి ఉపయోగిస్తున్న అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనానంతోపాటు ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు నాలుగు మొబైల్ ఫోన్లు, 26,700 రూపాయల నగదును కూడా సీజ్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు.
Also Read: కేటీఆర్.. అధికారం పోగానే అదుపు తప్పావా? మంత్రి పొంగులేటి నిప్పులు