BRS: 50 ఇయర్స్ ఇండస్ట్రీ. 8 ఏళ్లలో ఫుల్ డెవలప్మెంట్. రైతుల పక్షాన పోరాటం. మోదీనే విలన్. ఇలా సాగింది సీఎం కేసీఆర్ ప్రసంగం. మహారాష్ట్ర నుంచి పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు గులాబీ బాస్.
తన 50 ఏళ్ల అనుభవంతో 8 ఏళ్లలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు రైతులు, చేనేతలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్లని.. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందని తెలిపారు. దేశంలో పండుతున్న వరిలో సగానికి పైగా తెలంగాణలోనే పండుతుందని వెల్లడించారు. నల్లచట్టాల కోసం పోరాటం చేసిన రైతులను ఉగ్రవాదులన్నారని.. వారికి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున నేతలు ఈ పార్టీలో చేరుతున్నారు. కేసీఆర్తో చేతులు కలుపుతున్నారు. శనివారం మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ నేత శరద్ జోషి ప్రణీత్ గులాబీ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేసీఆర్ పార్టీ కండువా కప్పి శరద్ జోషిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు మహారాష్ట్ర నేతలో గులాబీ పార్టీలో చేరారు.
ముందుగా భారీ కాన్వాయ్తో శరద్ జోషి ప్రణీత్, మహారాష్ట్ర షెట్కారీ సంఘటన్ ప్రతినిధులు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.