Shivasena Reddy: తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు శివసేన రెడ్డి (సాట్స్ చైర్మన్) గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు.
సింగరేణిని తగలబెట్టమంటే అరెస్ట్ చేయరా?
బాల్క సుమన్ అరెస్ట్ అయితే బిఆర్ఎస్ నాయకులు దేశం, రాష్ట్రం కోసం ఏదో పెద్ద త్యాగం చేసినట్లు హంగామా చేస్తున్నారని శివసేన రెడ్డి మండిపడ్డారు. ‘సింగరేణి భవన్ను తగలబెట్టండి, రైల్వే పట్టాలు కోసేయండి’ అని ప్రజలను, కార్మికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్టం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. కేవలం తన సొంత పాపులారిటీ కోసమే సుమన్ అలా మాట్లాడి అరెస్ట్ అయ్యారని, ఆయనేమీ సత్యహరిశ్చంద్రుడు కాదని ఎద్దేవా చేశారు.
తప్పు చేస్తే ఎవరైనా జైలుకే!
ఇది చూస్తూ ఊరుకునే ప్రభుత్వం కాదని, తప్పు చేస్తే హోంమంత్రి, సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. తమ పార్టీ వారైనా, ప్రతిపక్షాల వారైనా చట్టం ముందర సమానమేనని చెప్పారు. ‘అరెస్ట్ అయితే జైలుకు పోతా’ అని గతంలో ప్రగల్భాలు పలికిన సుమన్, ఇప్పుడు అరెస్ట్ కాగానే ప్రభుత్వంపై ఎందుకు ఏడుస్తున్నారని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్ మెప్పు పొంది పార్టీలో పదవులు కాపాడుకోవడానికే ఇలాంటి ఉద్రిక్త వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోళ్లు.. ఉద్యమ బలిదానాలు
రైతుల నుంచి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత రేవంత్ ప్రభుత్వానిదేనని, కేసీఆర్ లేదా కేటీఆర్ వచ్చి కొంటారా అని శివసేన రెడ్డి ప్రశ్నించారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా బిఆర్ఎస్ నాయకులు ఇలాగే విద్యార్థులను రెచ్చగొట్టడం వల్లే ఎంతోమంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
Also Read:కేసీఆర్ పెద్ద పాలేరు, కేటీఆర్ చిన్న పాలేరు.. గాంధీ భవన్లో గజ్జెల కాంతం ధ్వజం!