Siricilla News: సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు కలకలం రేపాయి. సెస్ కార్యాలయ ప్రాంగణంలోని క్యాష్ సెక్షన్ గదిలో బుధవారం శ్రీ హంపి విరుపాక్ష విద్యారణ్య స్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి.
పూజ అనంతరం స్వామీజీ సెస్ కార్యాలయం వాస్తుకు లోపం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా చైర్మన్ కుర్చీలో కూర్చుని అధికారులకు ఉద్యోగులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. కార్యాలయం వాస్తు లోపాలు సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్వామీజీ చైర్మన్ కుర్చీలో కూర్చొని మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది.
సెస్ కార్యాలయంలో స్వామీజీ పూజలు నిర్వహించడంపై రాష్ట్రంలో భిన్న చర్చలు సాగుతున్నాయి. ఇటివల సెస్ కార్యాలయంలో వరుస తనిఖీలు, విజిలెన్స్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు తనిఖీల నేపథ్యంలో సంస్థలో నెలకొన్న అశాంతి నివారణకు, కార్యాలయానికి శాంతి చేకూరడం కోసం ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బయట గుసగుసలు వినిపిస్తున్నాయి. సెస్ అధికారులే ఈ పూజలు చేయించారనే ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రత్యేక పూజకు కొందరు సెస్ డైరెక్టర్లు హాజరు కాలేదు. ముఖ్యమైన డైరెక్టర్లు గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కార్యాలయంలో జరుగుతున్న వ్యవహారాలపై డైరెక్టర్లలో లోలోపల అసంతృప్తి ఉందనే వార్తలకు ఇది బలం చేకూర్చుతోంది. పూజ నిర్వహణ దాని ఉద్దేశంపై కూడా డైరెక్టర్ల మధ్య ఏకాభిప్రాయం లేదనే చర్చ నడుస్తోంది. ఏదేమైనా సెస్ కార్యాలయంలో స్వామీజీ పూజలు వాస్తు సూచనలు జిల్లాలో ప్రధాన వార్తగా మారాయి.