Sridhar Babu: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను యాగంతో పోల్చిన మంత్రి, దాన్ని BRS నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే విమర్శలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం ఆరోపణలకే పరిమితమయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా BRS నేతలకు బుద్ధి రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు.
మెట్రో విస్తరణపై ఆంక్షలు ఎందుకు?
గత కాంగ్రెస్ హయాంలోనే మెట్రో రైలు ప్రాజెక్టును మొదలుపెట్టాలని చూస్తే BRS అడ్డుకుందని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. తాము పదేళ్ల అధికారంలో ఉండి ఒక్క కిలోమీటర్ కూడా మెట్రో విస్తరించని BRS నేతలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నలుమూలలా (చార్మినార్ నుండి శంషాబాద్ వరకు) విస్తరిస్తుంటే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అలాగే బుల్లెట్ రైన్ ప్రాజెక్టును కూడా వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ఆర్థిక ఇంజిన్
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ఒక ప్రధాన ఇంజిన్లా నిలుస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఇందులో కాలుష్య కారక పరిశ్రమలకు తావులేదని, పర్యావరణహిత ఫార్మా ఇండస్ట్రీలను మాత్రమే తీసుకొస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ప్రపంచ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో ముందుకు వస్తున్నారని తెలిపారు. అయితే, అమెరికా వెళ్లిన హరీష్ రావు బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు మళ్లించేలా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు మళ్లీ అధికారంలోకి వస్తామంటూ పగటి కలలు కంటున్నారన్నారు.
ఐటీ హబ్గా మార్చింది కాంగ్రెస్సే!
హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వాలే పునాది వేశాయని మంత్రి గుర్తు చేశారు. 1992 నుంచే నగరానికి సాఫ్ట్వేర్ రంగం రావడానికి కృషి చేసి, హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ పార్కులను నిర్మించి అంతర్జాతీయ హబ్గా మార్చామన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ (ORR) నిర్మాణాలను కూడా అప్పటి ప్రతిపక్షాలు వ్యతిరేకించినా తాము వెనకడుగు వేయలేదన్నారు. నేడు బెంగళూరు, చెన్నై, ముంబై నగరాలకు ధీటుగా హైదరాబాద్ దూసుకుపోతుంటే BRS ఓర్వలేకపోతోందని మండిపడ్డారు.
మూసి ప్రక్షాళన, రహదారుల నిర్మాణం
కలుషిత నీరు, గాలితో ఇబ్బంది పడుతున్న మూసి పరివాహక ప్రాంత ప్రజల కోసం తాము మూసి ప్రక్షాళన చేపడుతుంటే దానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. అలాగే హైదరాబాద్ నుండి కరీంనగర్, నిజామాబాద్ వెళ్లే రహదారుల నిర్మాణం, నగరంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు KBR పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలను కూడా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు BRS పార్టీకి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టముందా లేదా అని ప్రశ్నించిన మంత్రి, ఇప్పటికైనా ఆలోచన మార్చుకోకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Also Read: రాజ్యాంగాన్ని కాపాడటమే రాహుల్ గాంధీ లక్ష్యం.. బీజేపీది ఓట్ల చోరీ కుట్ర.. జగ్గారెడ్డి
మళ్లీ అధికారంలోకి వస్తామంటూ హరీష్ రావు పగటి కలలు కంటున్నారు: మంత్రి శ్రీధర్ బాబు
అసలు బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టముందా లేదా .. ఒక స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే ఆలోచన మీకు ఉందా
అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, ఆ తర్వాత స్థానిక… pic.twitter.com/hfY0gz5wdq
— BIG TV Breaking News (@bigtvtelugu) May 23, 2026