Jagga Reddy: దేశ ప్రజలకు అంబేద్కర్ అందించిన రాజ్యాంగమే అసలైన కవచమని, దానిని కాపాడటమే రాహుల్ గాంధీ ముఖ్య ఉద్దేశమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. నెహ్రూ క్యాబినెట్ కాలం నుండి నేటి వరకు గాంధీ కుటుంబం దేశాభివృద్ధికి, ప్రజల హక్కులకు నిరంతరం కృషి చేస్తూనే ఉందన్నారు. ఇందిరా గాంధీ బ్యాంకుల జాతీయకరణ ద్వారా పేదలకు ఆర్థిక భద్రత కల్పిస్తే, రాజీవ్ గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లనే నేడు దేశంలో టెలిఫోన్, సైబర్ టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని గుర్తుచేశారు. సోనియా గాంధీ నేతృత్వంలో ఆర్థిక సంస్కరణలు, మన్మోహన్ సింగ్ హయాంలో ఉపాధి హామీ వంటి చారిత్రాత్మక పథకాలతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమైందని వివరించారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసమే ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిదని కొనియాడారు.
బీజేపీ విమర్శలు, ఓట్ల చోరీ ఆరోపణలు
బీజేపీ ప్రభుత్వంపై జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో స్వేచ్ఛను నిర్వీర్యం చేస్తూ, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గతంలో 54 లక్షల కోట్లుగా ఉన్న దేశ అప్పు.. మోదీ పాలనలో ఏకంగా 140 లక్షల కోట్లకు చేరిందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని, ఈవీఎంలను లేదా ఓట్లను దొంగిలించి బీజేపీ అధికారంలోకి వస్తోందని, ప్రజలు ఓటు వేయకపోయినా దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ సమస్యను పక్కనబెట్టి యువతను భజరంగ్ దళ్, హిందూత్వం పేరిట తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు రాష్ట్రాల అభివృద్ధి – కాంగ్రెస్ పిలుపు
తెలుగు రాష్ట్రాల ప్రజలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను కాంగ్రెస్ ఎంతో అభివృద్ధి చేసిందని, గతంలో ఇక్కడి ఎంపీ సీట్లతోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిందని గుర్తుచేశారు. మాట ఇచ్చిన ప్రకారం తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావాలన్నా, అక్కడి ప్రధాన హామీలు నెరవేరాలన్నా కాంగ్రెస్ గెలవడం అత్యంత అవసరమన్నారు. రాబోయే డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత కూడా దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే ఏకైక మార్గమని, అందుకే మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: నిప్పులకొలిమిలా తెలంగాణ.. హీట్ వేవ్పై హై అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు