Sarpanch Elections: రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ అర్బన్ మండలం, చింతల్ ఠాణా ఆర్ఆర్ కాలనీలో జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత మరణించిన అభ్యర్థి చర్ల మురళి ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. సాధారణంగా, అభ్యర్థి మరణించిన తర్వాత ఎన్నికలు వాయిదా పడటం లేదా ఆ స్థానానికి తిరిగి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఈ స్థానంలో ఎన్నికలు యధావిధిగా కొనసాగాయి.
గ్రామస్థులు, దివంగత అభ్యర్థి మురళిపై చూపించిన అభిమానం, నమ్మకమే ఈ అసాధారణ విజయానికి కారణమని తెలుస్తోంది. పోలింగ్ రోజున, ఓటర్లు మురళికి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో, చర్ల మురళి తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 378 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అనూహ్యంగా వచ్చిన ఈ ఫలితంతో చింతల్ ఠాణా ఆర్ఆర్ కాలనీలో ఉత్కంఠ నెలకొంది.
అభ్యర్థి మరణం తర్వాత ఎన్నిక జరగడం, ఆ తర్వాత ఆయన విజయం సాధించడం అనేది పంచాయతీ ఎన్నికల చరిత్రలో ఒక అరుదైన సంఘటనగా అధికారులు చెబుతున్నారు. దీంతో, ఎన్నికల ప్రక్రియ నిబంధనల ప్రకారం ఇప్పుడు ఏమి చేయాలనే దానిపై ఎన్నికల అధికారులు తీవ్ర తర్జనభర్జన పడుతున్నారు. చట్టపరమైన అంశాలను, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవడానికి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
మురళి మరణించినందున, చట్టప్రకారం ఆయన సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో, ఆ స్థానానికి తిరిగి ఎన్నికలు నిర్వహించాలా? లేక ఉప సర్పంచ్కు పూర్తి అధికారాలు కల్పించాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. గ్రామస్థులు తమ అభిమానాన్ని.. మద్దతును వ్యక్తం చేసినప్పటికీ, చట్టపరంగా ఈ ఫలితం చెల్లుబాటు అయ్యే విధానంపై ఎన్నికల కమిషన్ నిర్ణయం కీలకం కానుంది.
ALSO READ: CM Revanth Reddy: ఎల్లుండి మెస్సీతో ఫుట్బాల్ సమరం.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి