తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ వ్యవహారంలో బీజేపీ తమకు క్రెడిట్ కావాలంటోంది. బియ్యం పంపిణీ చేసే రేషన్ దుకాణాల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలు పెట్టాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ గొడవ చేస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కుదరదు పొమ్మంటోంది. ఒకవేళ సన్నబియ్యం ఇచ్చేది కేంద్రమే అయితే దేశం మొత్తం ఎందుకివ్వట్లేదని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దేశ జీడీపీకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తోంది తెలంగాణ ప్రజలేనని, తమ పన్నులతో ఇతర రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం.. ఆయా రాష్ట్రాల్లో మోదీ ఫొటోలతోపాటు తమ సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ కూడా పెట్టాలని మరికొందరు లాజిక్ తీస్తున్నారు.
ఇతర రాష్ట్రాల సంగతేంటి..?
తెలంగాణలో ఇటీవల రేషన్ కార్డ్ ఉన్న వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం మొదలు పెట్టింది. రేషన్ బియ్యం నాణ్యతపై ఉన్న అపోహలను తొలగించింది. ఈ సన్నబియ్యం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల్లో మంచి పేరొచ్చింది. దీంతో బీజేపీకి కడుపుమండుతోంది. బియ్యం పంపిణీకి కేంద్రం నిధులిస్తోందని, తెలంగాణలో పంచిపెట్టేవి కూడా కేంద్రం ఇచ్చిన బియ్యమేనని అంటున్నారు బీజేపీ నేతలు. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతలు షాకింగ్ రిప్లై ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్.. బీజేపీ నేతల వ్యాఖ్యల్ని ఖండించారు. తెలంగాణలో లబ్ధిదారులకు ఇస్తున్న సన్నబియ్యం బీజేపీనే ఇస్తే.. దేశం మొత్తం ఎందుకు ఇవ్వట్లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ తీరుపై ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రి బండి సంజయ్లో రోజురోజుకీ అభద్రతా భావం పెరుగుతోందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీలో గుర్తింపు కోసం, రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం బండి సంజయ్ ఆరాటపడుతున్నారని అన్నారు మహేశ్ కుమార్ గౌడ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనపడలేదని బండి వ్యాఖ్యానించడం విడ్డూరం అన్నారాయన. రాజకీయ అవసరాల కోసం బండి సంజయ్ హెచ్సీయూ వివాదంపై మాట్లాడటం సరికాదని హెచ్చరించారు.
రేవంత్ ఫొటో కూడా పెడతారా..?
ఇక ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, బీజేపీ నేతలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అసలు మోదీ ఫొటో ఎందుకు పెట్టాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వెళ్తున్న పన్నులను దామాషా ప్రకారం తిరిగివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చే నిధులతో ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోందని, ఆయా కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫొటోతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఫొటో కూడా పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మొత్తమ్మీద సన్నబియ్యం వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరుని చెడగొట్టాలని బీజేపీ చూస్తున్నట్టు తెలుస్తోంది. క్రెడిట్ కోసం చూస్తున్న బీజేపీకి ఆ అవకాశం ఇచ్చేది లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ విషయంలో బీజేపీ కూడా క్రెడిట్ కావాలని అడగటం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.