Urea Booking App: తెలంగాణలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చోవడం, చెప్పులు లైన్లో పెట్టి ఎదురుచూడటం వంటి కష్టాలకు చెక్ పెడుతూ వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన నూతన విధానం సత్ఫలితాలను ఇస్తోంది. “ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్” (Fertilizer Booking App) ద్వారా ఇంటి నుంచే సులభంగా యూరియాను బుక్ చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ప్రయోగాత్మకంగా (Pilot Project) ఐదు జిల్లాల్లో అమలు చేస్తున్న ఈ విధానం అద్భుత విజయాన్ని సాధించిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డా. బి. గోపి వెల్లడించారు.
ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, జనగాం, పెద్దపల్లి జిల్లాల్లో ఈ నెల 22వ తేదీ నుంచి ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. ఈ జిల్లాల రైతులు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఎరువులను బుక్ చేసుకుంటున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఈ ఐదు జిల్లాల నుంచి ఏకంగా 37,264 మంది రైతులు యాప్ ద్వారా యూరియాను బుక్ చేసుకోవడం విశేషం. వీరి ద్వారా ఇప్పటివరకు 1,15,534 యూరియా బస్తాల విక్రయాలు జరిగాయని, ఈ స్పందన తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చిందని డా. గోపి తెలిపారు.
ఎరువుల కొరతను కృత్రిమంగా సృష్టించి బ్లాక్ మార్కెట్ కు తరలించే దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ యాప్ ను రూపొందించింది. సాంకేతికతను జోడించడం ద్వారా ఎరువుల పంపిణీలో పారదర్శకతను పెంచాలని, రైతుల సమయాన్ని ఆదా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో యూరియా లారీ వస్తుందంటే చాలు రైతులు పనులన్నీ మానుకుని దుకాణాల ముందు పడిగాపులు కాసేవారు. ఇప్పుడు ఆ దుస్థితి పోయి, యాప్ లో బుక్ చేసుకోగానే స్టాక్ వివరాలు, డెలివరీ సమయం తెలుస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కేవలం పైన పేర్కొన్న ఐదు జిల్లాల్లో మాత్రమే ప్రస్తుతం యాప్ విధానం అమల్లో ఉందని, మిగిలిన జిల్లాల రైతులు ఎప్పటిలాగే నేరుగా ఎరువుల కొనుగోలు కేంద్రాలకు వెళ్లి యూరియా తీసుకోవచ్చని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. యాప్ లేదని మిగతా జిల్లాల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని డా. గోపి భరోసా ఇచ్చారు.
పైలట్ ప్రాజెక్టులో వచ్చిన ఫలితాలు, సాంకేతిక లోపాలను సరిచేసుకుంటూ విడతల వారీగా ఈ యాప్ సేవలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర రైతాంగం మొత్తం అరచేతిలో నుంచే తమకు కావాల్సిన ఎరువులను పొందే వెసులుబాటు రానుంది.
Read Also:Hyderabad Metro Phase 2: ఢిల్లీకి జై.. హైదరాబాద్పై చిన్నచూపు! మెట్రో విస్తరణలో కేంద్రం వివక్ష?