Minister Seethakka: తెలంగాణ రాష్ట్రం మహిళా ఆధారిత అభివృద్ధికి ప్రపంచానికే ఒక నమూనాగా నిలుస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ప్రపంచ వేదికపై తెలంగాణ మహిళా శక్తిని ప్రతిధ్వనింపజేస్తూ ఆమె చేసిన ప్రసంగం దేశం దృష్టిని ఆకర్షించింది. మహిళా సాధికారత ద్వారానే రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోందని ఆమె తెలిపారు.
‘తెలంగాణలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా 65 లక్షల మహిళా స్వయం సహాయక సభ్యులు ఏకమయ్యారు. ఇది దేశంలోనే అతిపెద్ద మహిళా నెట్వర్క్గా ఆవిర్భవించింది. ఇందిరా మహిళా శక్తితో ఒక్క మహిళ కూడా వెనకబడిపోకూడదన్నదే తెలంగాణ ప్రజా ప్రభుత్వ సంకల్పం’ అని మంత్రి స్పష్టం చేశారు. మహిళల ఆర్థిక స్వరూపంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇందులో భాగంగా 20 రకాల వ్యాపారాలు వేల కోట్ల బ్యాంకింగ్ రుణాలు వడ్డీలేని రుణాలు అందిస్తున్నారు. ఈ ఆర్థిక ప్రోత్సాహకాలు మహిళల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి.
మహిళా శక్తిని ఆర్థికాభివృద్ధికి కీలక చోదకశక్తిగా మారుస్తూ మౌలిక వసతుల కల్పనలో వారి భాగస్వామ్యాన్ని పెంచడం విశేషం. ప్రస్తుతం 32 జిల్లాల్లో 64 మెగావాట్ల మహిళా సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ అద్దె బస్సులు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు కావడం దేశంలోనే మొట్టమొదటిసారి. ఈ తరహా వినూత్న కార్యక్రమాలు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నాయి.రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఫ్రీ ట్రావెల్ పథకం మహిళలకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఈ పథకం ద్వారా మహిళలకు ఏకంగా రూ. 7,600 కోట్లు ఆదా అయ్యాయి. ఈ మొత్తం డబ్బు వారి కుటుంబ ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుంది. మహిళలు తమ కుటుంబాలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఈ పొదుపు దోహదపడుతుంది.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2047 నాటికి మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 90%కి సాధించడం లక్ష్యం. ఈ బృహత్తర లక్ష్యం ద్వారా మహిళా శక్తిని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. మహిళా శక్తితో 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపడం సాధ్యమవుతుందని మంత్రి సీతక్క ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళా అభివృద్ధి నమూనా మిగతా రాష్ట్రాలకు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
ALSO READ: Hydra: మియాపూర్ లో రూ.600 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా