Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రిపై లేవనెత్తిన అంశాలపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2014 నుంచి 2026 మార్చి 28 వరకు మైనింగ్ రంగంలో జరిగిన అవకతవకలు, అక్రమాలపై సిబీసీఐడీతో విచారణ జరిపిస్తానని ప్రకటించారని, కానీ ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వాగతించకుండా కావాలనే సభను నడవనీయకుండా రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.
బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం ఫైర్
ఆదివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మూడు హౌస్ కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. వాటి ద్వారా ఏమి సాధించారు? ఆ హౌస్ కమిటీలలో సభ్యుడిగా ఉన్న తాను సమావేశాలు నిర్వహించాలని కోరినప్పటికీ ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. హౌస్ కమిటీలను అడ్డంగా పెట్టుకుని ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేసి బీఆర్ఎస్లో చేర్చుకున్నారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడో కలిసిపోయాయి..
బడ్జెట్ సమావేశాలు సజావుగా జరగకుండా కుట్రపూరిత కార్యక్రమాలకు తెరలేపి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం బీఆర్ఎస్కు తగదని హెచ్చరించారు. బీజేపీ శాసనసభ్యులు ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇస్తామని అంటున్నారని, కాలేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని కోరుతూ ఎనిమిది నెలలు అవుతున్నప్పటికీ వారు ఏమి చేస్తున్నారు? బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడో కలిసిపోయాయి అంటూ డిప్యూటీ సీఎం క్లారిటీ ఇచ్చారు.
అనుకూలమైన వ్యక్తులకు పేరిట పట్టాలు
గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు పంచిన భూములను ధరణి పోర్టల్ తీసుకువచ్చి పార్ట్-బీలో పెట్టి తమకు అనుకూలమైన వ్యక్తుల పేరిట పట్టాలు ఇచ్చిన చరిత్ర బీఆర్ ఎస్ కు ఉన్నదన్నారు. ధరణి ద్వారా జరిగిన భూ అక్రమాలు, బాలానగర్లో అక్రమ పద్ధతిలో జరిగిన భూ బదిలీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హౌస్ కమిటీ వేయాలని చేసిన ప్రకటనను తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. పైగా ముందస్తు నోటీసు ఇవ్వకుండా సభలో మంత్రి పేరు బయట పెట్టడం సరికాదన్నారు.
సోలార్ విద్యుత్ వినియోగం
సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజా ప్రతినిధులు ఆదర్శంగా నిలవాలి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపు తెలంగాణను హరిత శక్తి సామర్థ్య రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ సోలార్ విలేజ్’కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కోరారు. ఆదివారం అసెంబ్లీ హాల్లో ఈ మేరకు రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు , శాసనమండలి సభ్యులకు ఆయన వ్యక్తిగతంగా లేఖలు అందజేశారు. ప్రతి ప్రజాప్రతినిధి తన సొంత గృహంలో 2కేడబ్ల్యూ గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ రూఫ్టాప్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. ప్రజల్లో సౌర విద్యుత్ పట్ల అవగాహన కల్పించాలంటే ముందుగా నాయకులే ఆదర్శంగా నిలవాలని, తద్వారా నివాస ప్రాంతాలను విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మార్చవచ్చని ఆయన ఆకాంక్షించారు.
Also Read: దక్షిణ కాశీలో మోడీ గర్జన? బండి సంజయ్ మాస్టర్ ప్లాన్.. ప్రధాని కార్యాలయానికి లేఖ!