తెలంగాణ శాసనసభలో ఉద్యోగాల భర్తీ రైతుల రుణమాఫీ అంశాలపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అశోక్ నగర్ లాఠీచార్జీల ఘటనను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనల్లో బిజీగా ఉన్నారని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం లేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. అమాయక యువత తలలు పగులుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హరీశ్రావు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క అత్యంత తీవ్రంగా స్పందించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందని నిలదీశారు. గత పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలతో సహా చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని ధ్వజమెత్తారు.
పాండవులు సంపాదించిన ఆస్తి అంతా కౌరవుల తద్దినాలకే సరిపోయినట్లు ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి తయారైందని సీతక్క వ్యాఖ్యానించారు. గత పాలకుల లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు బకాయిలు చెల్లించడానికే ఆదాయం సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక వెసులుబాటును బట్టి ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని స్పష్టం చేశారు. హరీశ్రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే సగం మందికి రుణమాఫీ కాలేదని ఆయన అంటున్నారని గుర్తుచేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ఆ రుణమాఫీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. అప్పుడే ఆ పని చేసి ఉంటే ఇప్పుడు ఈ ఇబ్బందులు ఉండేవి కావు కదా అని చురకలు అంటించారు.
గత ప్రభుత్వ హయాంలో అనేక మంది రైతులు చనిపోయారని సీతక్క గుర్తుచేశారు. అధికారం కోల్పోయామనే బాధతోనే ప్రతిపక్షాలు బురదజల్లే రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తాము చేస్తున్న మంచి పనులపై మట్టి పోయాలని చూడటం సరికాదని హితవు పలికారు. సభలో సీట్లు మారినంత మాత్రాన పాత చరిత్రను ప్రజలు మర్చిపోరని హెచ్చరించారు. పదేళ్ల సుదీర్ఘ కాలంలో చేయలేని పనులను ఇప్పుడు ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పుల మీద వడ్డీలు వాటిపై చక్రవడ్డీలు కట్టడానికే నిధులు పోతున్నాయని వివరించారు.
పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆగ్రహించారు. మట్టి దుమ్ము పోసుకునే చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ముందు తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ప్రజలకు వివరించి ఆ తర్వాతే తమకు సలహాలు ఇవ్వాలని హరీశ్రావుకు సీతక్క గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
ALSO READ: Mahesh Kumar Goud: బీజేపీకి దిమ్మతిరిగే కౌంటర్.. బీసీ రిజర్వేషన్లపై మహేశ్ కుమార్ గౌడ్ మాస్టర్ ప్లాన్