Telangana Budget Session: ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఎన్ని రోజులు జరుగుతాయనే విషయంపై స్పష్టత రాలేదు. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి ప్రభుత్వ విప్లు, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహాచార్యులు, సీఎస్ శాంతి కుమార్, డీజీపీ జితేందర్, మరికొందరు అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ముఖ్యమైన రైతు భరోసా పథకంపైనా కీలకమైన చర్చ జరిగే అవకాశం ఉన్నది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత విధివిధానాలపై నిర్ణయానికి వస్తామని ఇది వరకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అలాగే, జాబ్ క్యాలెండర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
రైతు భరోసా పథకంపై విధివిధానాల రూపకల్పనలో భాగంగా రైతుల అభిప్రాయాలను సేకరించే పనిలో మంత్రివర్గ ఉపసంఘం ఉన్నది. జిల్లాల పర్యటనలు చేస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్నది. ఈ అభిప్రాయాలను అసెంబ్లీలో చర్చించనున్నారు. ప్రతిపక్షాలతోనూ సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకోనున్నారు. పది ఎకరాల్లోపు రైతులకు రైతు భరోసా ఇవ్వాలనే నిర్ణయాన్ని మెజార్టీ ప్రజలు మద్దతు స్వాగతిస్తున్నారు. అయితే, ఆదాయపన్ను కట్టేరైతులకు రైతు భరోసా వేయాలా? వద్దా? అనేదానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించినా.. ఆశించిన స్థాయిలో చర్చలు జరగలేవు. రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. ఇప్పుడు పూర్తికాల బడ్జెట్ను ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఈ నెల 23వ తేదీనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలోనూ బడ్జెట్ ప్రవేశపెడుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇది వరకే వెల్లడించారు.
గత అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. కానీ, ఈ సారి సమావేశాలకు తాను హాజరవుతానని ఇటీవలే ప్రకటించడంతో.. రాబోయే సమావేశాలపై ఆసక్తి నెలకొంది. ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరిన్ని వలసలు జరుగుతాయనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫిరాయింపుల చట్టంపై చర్చించే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే మరోవైపు రాహుల్ గాంధీ అదే చట్టాన్ని కీర్తిస్తూ మాట్లాడుతారని, ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందనే వాదనలను బీఆర్ఎస్ ముందుకు తెచ్చే అవకాశం ఉన్నది. అలాగే.. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపైనా ప్రశ్నలు గుప్పించే అవకాశం ఉన్నది. ఇది వరకే సింహభాగం గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ ఇంకా గృహలక్ష్మీ కింద మహిళకు రూ. 2,500 అందించేటువంటి కొన్ని గ్యారెంటీలు పెండింగ్లోనే ఉన్నాయి.
రైతు భరోసాపైనా బీఆర్ఎస్ ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ.. ఇదే పథకం విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్లో చర్చించనుంది. ఇక రైతు రుణమాఫీకి ప్రభుత్వం ఇది వరకే డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. ఈ సారి కేసీఆర్ కూడా సమావేశాలకు వస్తే.. రెండు పవర్ హౌజ్లు ఎదురెదురుగా ఫైట్ చేసినట్టు ఉంటుందని చెబుతున్నారు.