TG Budget 2026: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పద్దు కింద విద్యుత్ రంగానికి రూ.21,285 కోట్లు ప్రతిపాదించింది. కాగా గతంకంటే రూ.64 కోట్లు మాత్రమే అదనంగా ప్రతిపాదనలు చేసింది. 2025-26లో భాగంగా రూ.21,221 కోట్లు ప్రతిపాదించింది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తూనే.. సంప్రదాయ ఇంధన వనరులను, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,187 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉండగా అందులో గణనీయమైన భాగం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తోంది. ఇదిలా ఉండగా ఈనెల 13న 18,228 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ను డిస్కంలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. 341.08 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను సరఫరా చేసి రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక వినియోగాన్ని నమోదుచేశాయి.
వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో నిధులు కేటాయించింది. కానీ గతేడాదికంటే పన్నెండువందల కోట్లు తగ్గినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2026-27 బడ్జెట్ లో వ్యవసాయం, రైతుసంక్షేమానికి 23,179 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ వ్యయం 1328కోట్లు, పథకాల కోసం 21851కోట్లు ప్రతిపాదించారు. రైతు భరోసాకు సైతం ఇందులో నుంచే కేటాయించనున్నారు. గతేడాది(2025-26)లో 24,439కోట్లు కేటాయించగా అందులో 18వేలకోట్లను రైతు భరోసాకు కేటాయించినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ బడ్జెట్ లో గతేడాది కంటే 1260కోట్లు తక్కువగా కేటాయించారు.
రాష్ట్ర బడ్జెట్ లో నీటిపారుదల శాఖకు రూ.22,615కోట్లు కేటాయించింది. ఇరిగేషన్ కు పెద్దపీట వేస్తున్నామంటూనే నిధుల కేటాయింపులో కోతపెట్టింది. గతేడాది(2025-26) బడ్జెట్ లో రూ. 23,373కోట్లు కేటాయించింది. ఈ బడ్జెట్ ను పోలిస్తే రూ.758కోట్లు తగ్గించింది. బడ్జెట్ లో కేటాయించిన నిధుల్లో పథకాలకు 11872కోట్లు.. నిర్వహణ వ్యయం 10,743కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
గతేడాది బడ్జెట్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.2,685 కోట్లను ప్రభుత్వం కేటాయించగా, ఈబడ్జెట్ లో కేవలం రూ.230.43 కోట్లే కేటాయించింది. ప్రాజెక్ట్ బ్యారేజీల పనులకు రూ.90.33 కోట్లు, కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీల కోసం మరో రూ.134.53 కోట్లు కేటాయించింది. మైనర్ ఇరిగేషన్కు రూ.2054.44 కోట్లు, వరదల నియంత్రణ, నివారణ కోసం రూ.280 కోట్లు కేటాయించింది. బడ్జెట్లో ఈ ఏడాది రూ.8,879.82 కోట్లు రుణాల చెల్లింపులకు కేటాయించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం తీసుకున్న రుణ చెల్లింపులే రూ.6,191.82 కోట్లుగాఉన్నట్లు పేర్కొంది. వాటర్ రీసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద మరో రూ.2,688 కోట్లు రుణాల కోసం ప్రభుత్వం కేటాయించింది.
Also Read: Stress: ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ మీకోసమే
బడ్జెట్ లో పౌరసరఫరాలశాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. 2026-27 బడ్జెట్ లో రూ.7366కోట్లు కేటాయించింది. ఇందులో నిర్వహణ వ్యయం115కోట్లు, పథకాలకు రూ.7251కోట్లు కేటాయించింది. గతేడాది(2025-26) శాఖకు 5734కోట్లు కేటాయించింది. అంటే గతేడాది కంటే ఈసారి బడ్జెట్ లో 1632కోట్లు కేటాయించినట్లు ప్రకటించింది.
రవాణాశాఖకు ఈ బడ్జెట్ లో 4,491కోట్లు కేటాయించారు. గతేడాది(2025-26) 4485కోట్లు కేటాయించగా, ఈ బడ్జెట్ లో అదనంగా 6కోట్లు కేటాయించడం విశేషం. ఈ ఏడాది బడ్జెట్ లో నిర్వహణ వ్యయం కింద 131కోట్లు, పథకాలకు 4361కోట్లుగా ఇందులో కేటాయించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినవెంటనే అమలు పరచిన మొదటి వాగ్దానం– ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలోని 34 లక్షల 37వేలమంది మహిళలు ఉచితంగా ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారారాష్ట్రంలోనిమహిళలు 269 కోట్ల 68 లక్షల ఉచిత ప్రయాణాలు చేసి, దాదాపు9 వేల 222 కోట్ల రూపాయలను (రూ.9,222 కోట్లు) ఆదాచేసుకున్నారు.
Also Read: Sports Budget: తెలంగాణ రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి 9 కీలక ఓప్పందాలు