Surplus Rice: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ విధాన నిర్ణయాల మేరకు, కేబినెట్ ఆమోదంతో, ప్రభుత్వ ఈ-మార్కెట్ప్లేస్ (జీఈఎం) వేదికగా నిర్వహించిన మిగులు దొడ్డు బియ్యం విక్రయ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ స్పష్టం చేసింది. మీడియా ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా లబ్ధిదారులకు సన్నబియ్యం సరఫరా చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మిగులుగా నిల్వ ఉందన్నారు.
దీర్ఘకాలం నిల్వ ఉంచితే నాణ్యత క్షీణించడం, గిడ్డంగుల కొరత, అదనపు వ్యయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా విక్రయ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. విక్రయ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ ఈ-మార్కెట్ప్లేస్ ద్వారా నిర్వహించామని, ఎలాంటి నామినేషన్లు, ప్రాధాన్యత కేటాయింపులు లేదా రహస్య ఒప్పందాలకు తావులేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి బిడ్డర్కు సమాన అవకాశాలు కల్పించినట్లు పేర్కొంది.
Also read: విడాకులు తీసుకోబోతున్న మరో టీవీ నటి.. అసలేం జరిగిందంటే..?
రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన రూ.21.60 కిలో (రూ.21,600 టన్ను) రిజర్వ్ ధర కంటే ఎక్కువగా టన్నుకు రూ.21,700 ధర లభించిందని, ప్రభుత్వ ఆస్తులను తక్కువ ధరకు విక్రయించలేదన్నారు. సుమారు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వల మొత్తం విలువే సుమారు రూ.303 కోట్లు మాత్రమే ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క గింజ బియ్యం కూడా విడుదల కాలేదని, ఒక్క విడుదల ఉత్తర్వు కూడా జారీ కాలేదని, ఒక్క కిలోగ్రాము నిల్వ కూడా గిడ్డంగుల నుంచి తరలించలేదని సంస్థ పేర్కొంది.వేలంలో విజయం సాధించిన సంస్థలు ఒప్పందాలు, సెక్యూరిటీ డిపాజిట్లు పూర్తి చేసినప్పటికీ పత్రాల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోందని సంస్థ వివరించింది.
మిగులు దొడ్డు బియ్యం విక్రయానికి సంబంధించిన ధర నిర్ణయం, వేలం నిబంధనలు, అనుమతులు, ప్రక్రియలన్నీ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన ప్రభుత్వ విధానాల ప్రకారమే జరిగాయని, మొత్తం వ్యవహారం పూర్తిగా చట్ట బద్ధమే నని, పారదర్శకమైనది, ఆడిట్కు అనుకూలమైనదని సంస్థ పేర్కొంది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎల్లప్పుడూ పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేస్తుందని, ఏ దర్యాప్తు సంస్థ ముందు అయినా అన్ని రికార్డులు అందజేసేందుకు సిద్ధంగా ఉందని వివరించింది.
Also Read: వృద్ధుల కోసం క్రేజీ 4-వీల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. చూడ్డానికి భలే ఉంది భయ్యా!